వ్యాక్సికేషన్ లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ - 91.11 శాతం మందికి టీకాలు..!!
దేశ వ్యాప్తంగా టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్న వేళ ఈ నెల 3వ తేదీ నుంచి కేంద్రం టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది. ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి అయిదు రోజుల్లోనే ఏపీలో నిర్దేశించిన లక్ష్యంలొ 72 శాతం పూర్తి చేసింది. ఇతర రాష్ట్రాల కంటే దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ 50 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ, హిమాచల్ప్రదేశ్లు మాత్రమే ఉన్నాయి.
దేశంలోనే తొలి స్థానంలో ఏపీ
హిమాచల్ప్రదేశ్లో 68.40 శాతం మంది పిల్లలకు టీకా వేశారు. దక్షిణాదితో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క పెద్ద రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి టీకా పంపిణీ పూర్తి కాలేదు. ఇక రాష్ట్రంలో కేవలం 28 శాతం మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉంది. రాష్ట్రంలో అర్హులైన 24,41,000 మంది పిల్లలకు వారం రోజుల్లో టీకా పంపిణీ పూర్తిచేసేలా సర్కారు కార్యాచరణ రూపొందించింది. దీంతో శుక్రవారం నాటికి 17,52,581 మందికి టీకాలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయడంతో పాటు, వీటి పరిధిలో ఉన్న విద్యా సంస్థల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు.
అత్యధికంగా కడప జిల్లాలో
వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 1,55,086 మందికి టీకా పంపిణీ చేయాల్సి ఉండగా 91.11 శాతం అంటే 1,41,304 మందికి టీకా పంపిణీ జరిగింది. అదే విధంగా తూర్పు గోదావరిలో 86.36 శాతం, నెల్లూరులో 84.76 శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 53.59 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 150 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులు
గడిచిన 24గంటల్లో 37,553 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,659 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పండగు రోజుల కావటంతో మరింత వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంక్షల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని.. ఇప్పటికిప్పుడు కఠిన ఆంక్షలు అవసరం లేదనే అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది. అయితే, కేసులు మరింతగా పెరగక ముందే చర్యలు తీసుకొనే దిశగా ఆలోచన జరుగుతోంది. సోమవారం దీని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.