ఎపి విద్యార్థుల ఆర్టీసి బస్ పాస్లకు కెసిఆర్ ఎసరు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదని ప్రకటించి షాక్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో కోతకు కూడా సన్నద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆర్టీసి బస్సుల్లో బస్ పాస్ ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటనను బట్టి ఆ విషయం బోధపడుతోంది.
శనివారంనాడు ఉన్నతాధికారులతో సమావేశమైన మహేందర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణలో రాయితీతో కూడిన బస్ పాసులు జారీ చేసే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఎపి బస్సులను ఆపేస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ బస్సు ఆపరేటర్లను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ఏ ప్రాంతానికి చెందిన ఆర్టీసి అధికారులు ఆ ప్రాంతం నుంచే విధులు నిర్వహించాలని ఆయన అన్నారు.
వచ్చే మూడు నాలుగు నెలల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లకు కొత్త వోల్వో బస్సులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్కు 80, వరంగల్కు 30, కరీంనగర్కు 20 బస్సుల చొప్పున కేటాయిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులో ప్రతి ఐదు నిమిషాలకో బస్సు ఎక్కడికైనా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వచ్చే నెల 5,6 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం బృందం రవాణా వ్యవస్థ పరిశీలనకు ముంబై వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సహకార రుణాల బకాయిలను చెల్లిస్తామని ఆయన చెప్పారు.