ఎవరు హీరో-ఎవరు విలన్ ? గోదావరి వరదలపై అచ్చెన్నాయుడు ఆసక్తికర ట్వీట్
ఈ ఏడాది గోదావరి నదికి వచ్చిన వరదలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో తిరుగుతున్న సీఎం జగన్, విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో ఆయాపార్టీలకు చెందిన నేతలు కూడా ఈ విమర్శల్ని మరింత ముందుకు తీసుకెళ్తూ కొత్త పోలికలు కూడా తెచ్చేస్తున్నారు.
గోదావరి వరద ప్రాంతాల్లో చంద్రబాబు ఇప్పటికే రెండు దఫాలుగా పర్యటించారు. తొలుత ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు... అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. అనంతరం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా వెళ్లారు. అక్కడ స్ధానికంగా వరద బాధితులతో మమేకమయ్యారు. మరోవైపు సీఎం జగన్ కూడా ఓసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కానీ వీరిద్దరి పర్యటనల్లో కొంత వ్యత్యాసం కనిపించింది. సహజంగానే సీఎం జగన్ కు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జగన్ చంద్రబాబు తరహాలో అన్నిచోట్లకు వెళ్లలేకపోయారు. దీంతో ఇప్పుడు అదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్వీట్ పెట్టారు.
గోదావరి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన సమయంలో దిగిన ఫొటోల్ని, అలాగే జగన్ పర్యటన సందర్భంగా తీసిన ఫొటోల్ని కలిపి ఓ ట్వీట్ లో అచ్చెన్నాయుడు పోస్ట్ చేశారు. ఇందులో నాయకుడెవరు, ప్రతినాయకుడెవరు అంటూ ఆయన ఓ ప్రశ్న కూడా వేశారు. ఈ ఫొటోల్లో చంద్రబాబు వాహనాల్లో నుంచి దిగి జనం దగ్గరికి వెళ్తున్నట్లు కనిపిస్తుండగా.. జగన్ మాత్రం వాహనాల్లో పర్యటిస్తున్నట్లు, తనకు భారీ భద్రత పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ రెండు ఫ్రేమ్ ల్లో ఉన్న ఫొటోలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.