టీడీపీ సంచలన నిర్ణయం : నాడు జగన్ - నేడు చంద్రబాబు : 2024 నాటికి కలిసొచ్చేనా..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా వైసీపీ..టీడీపీ వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఒక పార్టీని మరో పార్టీ టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా... టీడీపీ ఇక అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు ఇకపై హాజరు కారాదని డిసైడ్ అయింది. తన సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టబోనని ప్రతిపక్ష నేత చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పట్లో తమ నిర్ణయం ప్రకటించలేదు. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం
దీంతో..టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను పార్టీ నాయకత్వం సేకరించింది. దీని పైన పొలిట్బ్యూరో సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ఇందులో నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగా ఇంతకాలంపాటు అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీ చరిత్రలో ఇదే ప్రథమం. గతంలో వైసీపీ అధినేత సైతం తమ పార్టీ నుంచి ఫిరాయించి మంత్రులు అయిన నలుగురి పైన వేటు వేయాలనే డిమాండ్ చేస్తూ సమావేశాలను బాయ్ కాట్ చేసారు. 2019 ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నార ముందే అక్టోబర్ 2017లో నిర్ణయం తీసుకొని..ఆ తరువాత జగన్ 2017 నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

నాడు జగన్ సైతం ఇదే నిర్ణయం
సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర సమయంలో జగన్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి హాజరు కాలేదు. కానీ, జగన్ అసెంబ్లీకి రాకున్నా.. పాదయాత్ర ద్వారా సుదీర్ఘ కాలం ప్రజలతో ఉంటూ.. రాజకీయ వ్యూహాలు యాత్ర నుంచే అమలు చేస్తూ..2019 లో అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, కారణాలు..పరిస్థితులు వేరైనా నాడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు ఒకే నిర్ణయం తీసుకున్నారు. అయితే, అసెంబ్లీ బహిష్కరించిన వెంటనే జగన్ అప్పటికే పాదయాత్ర కు సిద్దమయ్యారు. కానీ, ఇప్పుడు టీడీపీ మాత్రం రెండు సభల్లోనూ వైసీపీ మెజార్టీ ఉండటంతో..వారి నిర్ణయాలకు రూట్ క్లియర్ చేసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ పార్టీ పరంగా వచ్చే ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది.

టీడీపీ వ్యూహం ఏంటి
ముందుగా పార్టీ సభ్యత్వంతో పాటుగా మహానాడు ద్వారా ఎన్నికల సమర శంఖం పూరించాలని భావిస్తోంది. త్వరలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనంలోకి వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందు కోసం ఆయన యాత్ర ప్రారంభిస్తారని చెబుతున్నారు. వచ్చే ఏడాది పార్టీ అధినేత చంద్రబాబు సైతం బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. గతం కంటే భిన్నంగా ఈ సారి ముందుగానే పార్టీ అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. జనసేన - బీజేపీ అడుగులను గమనిస్తున్నారు. వైసీపీ మినహా మరే పార్టీని దూరం చేసుకోకూడదనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

జగన్ - చంద్రబాబు టార్గెట్ 2024
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ భవిష్యత్ కార్యచరణ..కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే, 2014 పొత్తులు తిరిగి ఏపీలో కనిపిస్తాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ సైతం ఇప్పటికే ఆ మూడు పార్టీల పైనా విమర్శలు మొదలు పెట్టింది. రాష్ట్రపతి ఎన్నికల తరువాత కేంద్రంతో - బీజేపీతో జగన్ సంబంధాల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక, రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా అటు సీఎం జగన్.. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications