ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఆయనే..! బాబు యూరప్ నుండి రాగానే ఆదేశాలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి తెలుగుదేశం పార్టీ లో ప్రక్షాళనలకు శ్రీకారం జరగబోతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు యూరప్ నుండి రాగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. పార్టీని బ్రతికించుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో దారుణ ఓటమి నేపథ్యంలో, పార్టీ ప్రక్షాళనపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే, టీడీపీకి విశేష సేవలందించిన, గతంలో ఎన్నోసార్లు కష్టకాలంలో నమ్ముకుని వెన్నంటి ఉన్న కింజారపు ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని నియమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్మోహన్ నాయుడిని లోక్ సభాపక్ష ఉప నాయకుడిగా బాబు నియమించారు. ఇప్పుడు ఏకంగా ఏపీ రాష్ట్ర శాఖ బాధ్యతలు ఇవ్వబోతున్నారు.
అసెంబ్లీలో టీడీపీ ఉప నాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడు మరెవరో కాదు, రామ్మోహన్ నాయుడుకు స్వయానా బాబాయ్. ఇప్పటివరకు ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కళావెంకట్రావ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారు. కళా వెంకట్రావ్ ను డమ్మీగా నారా లోకేష్ మార్చారని, చక్రం తిప్పారని విమర్శలున్నాయి. ఇప్పుడు లోకేష్ కూడా ఓడిపోయారు. ఆయన నాయకత్వాన్ని కూడా పార్టీ నేతలు, క్యాడర్ అంగీకరించే పరిస్థితి లేదు. వీటన్నింటి నేపథ్యంలో, బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వక్త.. యువ నేత.. తండ్రి ఎర్రం నాయుడిలాగే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న రామ్మోహన్ నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సుంది. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో రామ్మోహన్ ఎంతవరకు సఫలీకృతమవుతారో చూడాలి మరి.