ఏపీ, తెలంగాణలో టార్గెట్ చంద్రబాబు సీజన్ నడుస్తోంది..!!
హైదరాబాద్:చేసిన తప్పుకు నిందలు మోస్తే ఆ బాధ ఎక్కువ రోజులు ఉండదు. అదే చేయని తప్పుకు అవమానాలకు గురవ్వడమంటే ఎంత చిత్రహింసగా ఉంటుందో వర్ణించలేం. ఐన దానికి, కాని దానికి అందరూ అతన్నే టార్గెట్ చేస్తూ పచ్చిగా విమర్శిస్తుంటే రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అనే అందోళన కలగక మానదు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు చంద్రబాబుకు ఎలాంటి సంబందం లేకపోయినప్పటికి తెలంగణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్టు బాబును అడ్డగోలుగా దూషించడం పనిగా పెట్టుకుంది గులాబీ పార్టీ.
ఇదే చంద్రబాబుతో 2009లో పొత్తు పెట్టుకున్న చంద్రశేఖర్ రావే ఇప్పుడు కాంగ్రెస్ టీడిపి పొత్తు అనైతికమంటూ చంద్రబాబును దూషించడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో సాధించి ఘనత ఏమీ లేకనే చంద్రబాబు ను తిడుతూ మళ్లీ ప్రజల మద్దత్తు కూడగట్టేందుకు చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు ముమ్మరం చేసారనే చర్చ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బాబే టార్గెట్..! ఏ పార్టీ ఐనా నిందించాల్సిందే..!!
భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, జనసేన మూడు పార్టీల లక్ష్యం ఒక్కటే..! అది కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అవసరం ఉన్నా లేకున్నా కడిగి పారేయాలని. ఎక్కడికక్కడ, సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడిపై విమర్శల జడివానకు ఈ మూడు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మూడు పార్టీల ఉమ్మడి శత్రువు ఒక్కరే అనే నినాదంతో అటు ఆంధ్రప్రదేశ్లోనూ, ఇటు తెలంగాణలోనూ చంద్రబాబు నాయుడిపై ఏక కాలంలో విమర్శలు, ఆరోపణలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

జగన్ బాటలోనే పవన్...! చంద్రబాబును దూషించడమే లక్ష్యం..!!
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ సభలో పాల్గొన్నా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన విమర్శలను చంద్రబాబు నాయుడిపైనే సంధిస్తున్నారు. రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన బహిరంగ సభలో అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా ఆయన్ని తిరిగి అధికారంలోకి రానివ్వం అని ప్రకటించారు. తెలుగుదేశం శాసనసభ్యులను అయితే నేరుగా దొంగలు, గూండాలు, ఇసుక బకాసురులు అంటూ మాటల తూటాలను ఎక్కుపెడుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీని కాని, రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీని కాని పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట అనడం లేదు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు అయితే ఏకంగా కోర్టులకే వెళ్తామంటున్నారు.

ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్..! ఒక్కసారిగా బాబు పై మెరుపు దాడి..!!
ఇక తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇన్నాళ్లూ చంద్రబాబు నాయుడ్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఎన్నికల సమరం దగ్గర పడడంతో విమర్శలు రెట్టింపు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు భారతీయ జనతా పార్టీ ఉచ్చులో పడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం వెనుక కూడా ఆ మూడు పార్టీల వ్యూహం ఆయనకు తెలియడమేనంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వీలున్నంత ఎక్కువ దాడి చేసి చంద్రబాబునాయుడ్ని నైతికంగా దెబ్బ తీయాలన్నది మూడు పార్టీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

బీజేపీ ఆడిస్తున్న వింత నాటకం..! రక్తి కడుతుందా..! విరక్తి పుట్టింస్తుందా..!!
బుధవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ముందు జరగబోయే అన్ని బహిరంగ సభల్లోనూ చంద్రబాబు నాయుడే లక్ష్యంగా విమర్శలు గుప్పించాలని భావిస్తోందంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా తెలుగుదేశం పార్టీపైనే ఎక్కువ ద్రష్టి పెట్టాలని దిగువ శ్రేణి నాయకులకు వర్తమానం పంపినట్లు సమాచారం. మహాకూటమిలోని ఇతర పార్టీలతో పెద్దగా ఇబ్బంది లేదని, ఆంధ్రా పార్టీగా తెలుగుదేశం పార్టీకి ముద్ర వేసి దాని ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది కె.చంద్రశేఖర రావు వ్యూహంగా చెబుతున్నారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ను, తెలంగాణలో కె.చంద్రశేఖర రావును ప్రయోగించి చంద్రబాబు నాయుడ్ని దెబ్బతీయాలనుకుంటున్నారని రాజకీయాల్లో లోతైన చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications