పింక్ డైమండ్ పై రమణ దీక్షితులు ఆరోపణ అసత్యం...తేలిపోయింది:మాజీ సీవీఎస్వో
తిరుమల:టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలతో మొదలైన తిరుమల వివాదంపై ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా టిటిడి వ్యవహారాలకు సంబంధించి టిటిడి మాజీ సీవీఎస్వో రమణకుమార్ మరోసారి మీడియాతో మాట్లాడారు.
గతంలో బంగారు డాలర్ల కుంభకోణం విచారణ సమయంలో పింక్ డైమండ్ కనబడటంలేదని రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీనిపై రమణదీక్షితులుతో పాటు నరసింహదీక్షితులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. అయితే ఆభరణాలు భద్రపరిచే గది తాళాలు డాలర్ శేషాద్రి దగ్గర ఉందకూదడని తాను నివేదిక ఇచ్చానని, నా రిపోర్టు చూసి టిటిడి పాలక మండలి అంతా భయడిందని ఆయన వివరించారు.
తిరుమల వివాదం విషయమై టిటిడి మాజీ సీవీఎస్వో రమణకుమార్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి ఆలయ పోటు తవ్వకాలపై విచారణ అవసరమేనని అన్నారు. 300 గ్రాముల బంగారు డాలర్ల కుంభకోణం పై విచారణ సందర్భంగా పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులే తనతో చెప్పారన్నారు. రమణ దీక్షితులు మీరాశి వంశీకులు కాబట్టి నమ్మానని రమణ దీక్షితులుతో పాటు నరసింహ దీక్షితులూ అలాగే స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు.
అయితే పింక్ డైమండ్పై ఫిర్యాదు ద్వారా రమణ దీక్షితులు తనను పక్కదారి పట్టించారని రమణకుమార్ అన్నారు. రమణ దీక్షితులు ఇచ్చిన ఫిర్యాదును అప్పుడు తాను పరిగణనలోకి తీసుకున్నానని, అందుకే తన రిపోర్టులో ఆ విషయం ప్రస్తావించానని తెలిపారు. అయితే రమణ దీక్షితులు ఆరోపణలో వాస్తవం లేదని జస్టిస్ జగన్నాథరావు కమిటీ నివేదికలోనే తేలిపోయిందన్నారు.
అలాగే అప్పటి విచారణలో శ్రీవారి ఆభరణాల విలువ రూ.50 వేల కోట్లని తన నివేదికలో పేర్కొన్నట్లు రమణ కుమార్ తెలిపారు. ఇక యాంటిక్ ఆభరణాల విలువ రూ.లక్ష కోట్ల పైమాటేనని అప్పటి ఈవో రమణాచారి పేర్కొన్నట్లు రమణకుమార్ చెప్పారు. అలాగే ఆభరణాలు భద్రపరిచే గది తాళాలు రెండూ డాలర్ శేషాద్రి దగ్గర ఉండేవని, అలా ఉండకూడదని తాను నివేదికలో పేర్కొన్నానన్నారు. నా దర్యాప్తు రిపోర్టు చూసి టిటిడి పాలక మండలి అంతా భయడిందని ఆయన వివరించారు. అప్పటి తన నివేదికను అప్పుడు సిఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిశీలించారని తెలిపారు.
తదనంతరం తాను ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆభరణాల భద్రత విషయంలో చాలా మార్పులు చేశారని రమణ కుమార్ తెలిపారు. శ్రీ వారి నగలను ఆలయంలో జమాలజీ ల్యాబ్ ఏర్పాటుచేసి లెక్కగట్టారన్నారు. తాను ఇంతవరకూ పింక్ డైమండ్ని చూడలేదన్నారు. అదేవిధంగా రమణ దీక్షితులు టీటీడీకి ఇచ్చిన విరాళాన్ని తన అకౌంట్లో వేసుకునే వారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పటి ఈవో రమణాచారి దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఈవో ఆయన్ని మందలించి వదిలేశారని రమణ కుమార్ చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై సీబీఐ విచారణ చేయించాలని రమణకుమార్ కోరారు.