'బోటు ప్రమాదంలో అసలు నేరస్తులను వదిలి కిందిస్థాయి ఉద్యోగులపై వేటు'
అమరావతి: కృష్ణా నదిలో మొన్నటి ప్రైవేటు బోటు ప్రమాదంలో 22 మంది మరణించడం బాధాకరమని, వారి కుటుంబాలకు యూనియన్ ప్రగాడ సానుభూతిని తెలుపుతోందని, ఈ ప్రమాదానికి కారకులైన అసలు బాధ్యులను వదిలేసి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు బోటుతో సంబంధం లేని క్రింది స్థాయి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని ఏపి టూరిజం కాంట్రాక్టు, మ్యాన్పవర్, డైలీవేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది.
Recommended Video
పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?
ప్రైవేటు బోటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న అసలు నేరస్తులను, వారి వెనకనున్న పెద్దలను వదిలివేయడం సరైనదికాదని యూనియన్ భావిస్తోంది. అసలు నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అక్రమంగా సస్పెండ్ చేసిన, తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది.ప్రజల ప్రాణాలు హరించిన ప్రైవేటీకరణ విధానాలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, ఇప్పటికే టూరిజంలో కుదుర్చుకున్న ప్రైవేట్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు యూనియన్ ప్రకటన చేసింది.
మానవ తప్పిదమా, ప్రభుత్వ విధానామా
ఈ ఘటనకు కారణం కేవలం మానవ తప్పిదమా? లేక ప్రభుత్వ విధానమా? ఎప్పటిలానే ప్రమాదం జరిగాక ప్రభుత్వం, మంత్రులు, అధికార పెద్దలు యధాశక్తిగా హడావిడి చేస్తున్నారు. బోటు ప్రమాదం జరిగాక రకరకాల వాదనలు, విశ్లేషణలు, ఈ ఘటనను ఖండించిన వారిని రాజకీయం చేస్తున్నారంటూ నిందించడాలు జరిగాయి. ఏమైనా ప్రభుత్వం ఘటనపై పోస్ట్మార్టమ్ బాగా చేస్తోంది. ప్రభుత్వంలోని పెద్దలు ఎవరిపాత్ర వారు యధాశక్తి పోషిస్తున్నారు. కాని వాస్తవమేమిటి?
ప్రమాదానికి చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత
నిన్నటి ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే. ప్రైవేట్ వారికి అనుమతులిచ్చింది, 10 జీ.ఓలను విడుదల చేసింది గౌ||చంద్రబాబుగారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడే. కాంట్రాక్ట్ ఉద్యోగులు(సిఐటియు) వ్యతిరేకించి రోజంతా ధర్నా నిర్వాహిస్తే నేరుగా సీఎం ఆఫీస్ జోక్యం చేసుకొని నాటి ఎండి, ఈడిలపై వత్తిడి తెచ్చింది. వ్రాత పూర్వక ఉత్తర్వులు లేకుండానే బోట్లు తిప్పడానికి అనుమతించింది.
రివర్ బోటింగ్ సంస్థపై ఆగ్రహం
టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించని పైవేట్ సంస్థలకు టూరిజం సేవలను అప్పగించి ప్రజల ప్రాణాలను హరిస్తోంది. దీనికి కారణం ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానమే. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని టూరిజాన్ని నడపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అనుమతి లేకుండా బోటు నడుపుతున్న రివర్ బోటింగ్ ఎడ్వంచర్స్ సంస్థను రద్దు చేయాలని, యజమాని సంస్థపై చర్యలు తీసుకోవాలని ఎపి టూరిజం కాంట్రాక్టు, మ్యాన్పవర్ డైలీ వేజ్ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సస్పెండ్ చేసిన ఉద్యోగులందర్నీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు యూనియర్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎన్.సిహెచ్.శ్రీనివాస్ సిఐటియు జిల్లా కార్యదర్శి, ఎం.బాబురావు ఏపి కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్, బి.సత్తిబాబు సిఐటియు విజయవాడ పశ్చిమ నగర కార్యదర్శి, ఎస్.సుబ్బారెడ్డి సిఐటియు కార్యదర్శి పాల్గొన్నారు.
ప్రైవేట్ సంస్థల కోసమే రాష్ట్ర ప్రభుత్వ జీ.ఓలు అని ఆరోపణ
క్రింది జీ.ఓలను చంద్రబాబునాయుడు పర్యాటకశాఖ బాధ్యులుగా ఉన్నప్పుడే విడుదల చేశారని వారు చెప్పారు. ప్రైవేటీకరణ విధానాలు టూరిజంలో అమలు ప్రారంభించేదాకా ఆశాఖకు మంత్రినే కేటాయించలేదన్నారు. ఈ జీ.ఓలన్నీ వారి హయాంలో జారీ చేసినవే అన్నారు. ఈ సందర్భంగా పలు జీవోలను ప్రస్తావించారు.