అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను కలుపుతూ సరికొత్త సెమీ రింగ్ రోడ్డు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి బలమైన మెగా ప్రాజెక్టును చేపట్టింది. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను అనుసంధానం చేసే 102కిలోమీటర్ల సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక సిద్ధమైంది. రూ.4,449 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. రాంబిల్లి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించే ఈ రహదారి ఉత్తరాంధ్రలో మొదటి ఎక్స్ప్రెస్వే తరహా రోడ్డుగా రికార్డు సృష్టించనుంది.
మూడు జిల్లాలను కలుపుతూ అర్ధచంద్రాకారంలో సెమీ రింగ్ రోడ్
విశాఖపట్నం నగరంలో వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. నగరం చుట్టూ పూర్తి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం భౌగోళిక పరిస్థితుల వల్ల సాధ్యం కాకపోవడంతో, మూడు జిల్లాలను కలుపుతూ అర్ధచంద్రాకారంలో సెమీ రింగ్ రోడ్ను రూపొందించారు. ఈ రహదారిని 4, 6 మరియు 8 లేన్లతో అత్యాధునిక ఎక్స్ప్రెస్వే రూపంలో తీర్చిదిద్దనున్నారు.

యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ ప్రెస్ వే.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 102 కి.మీ. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వే గా దీనిని నిర్మాణం చేయనున్నారు. దీనికోసం మొత్తం 12,114 ఎకరాల భూసేకరణ అవసరం కాగా అందులో 8,000 ఎకరాలు ప్రైవేటు భూములు. ఈ రోడ్దు నిర్మాణం కోసం డీపీఆర్ ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి, జూన్ 15 నాటికి పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భోగాపురం విమానాశ్రయానికి సరుకు రవాణా చాలా వేగవంతం
ఈ రోడ్ మార్గంలో భీమిలి, పద్మనాభం, చోడవరం, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం, ఎలమంచిలి, డెంకాడ, కొత్తవలస వంటి ముఖ్య మండలాలు ఉన్నాయి. దీని వల్ల పారిశ్రామిక కేంద్రాలైన రాంబిల్లి, అచ్యుతాపురం నుంచి భోగాపురం విమానాశ్రయానికి సరుకు రవాణా చాలా వేగవంతం అవుతుంది. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థను మార్చేలా సెమీ రింగ్ రోడ్
ప్రభుత్వం భూసేకరణలో ఆలస్యం జరగకుండా అమరావతి మాదిరి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది. మున్సిపల్ పరిపాలన మంత్రి నారాయణ సూచనల మేరకు ప్రాజెక్టు త్వరగా అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సెమీ రింగ్ రోడ్ నిర్మాణం ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుంది.
ఉత్తరాంధ్ర ప్రజలకు గొప్ప బహుమతి
విశాఖ నగర ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, పర్యాటకం, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. రాబోయే 50 ఏళ్ల అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలకు గొప్ప బహుమతిగా నిలుస్తుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.













Click it and Unblock the Notifications