ఇలా అయితే కష్టం: వైరల్ గా మారిన మంత్రి రోజా ఆడియో
రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్ కే రోజా నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి. ఎన్నికలు ముగిసిన తర్వాత నియోజకవర్గానికి చెందిన నేతలు పలువురిని ఆమె దూరంగా ఉంచారు. వారిలో శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కేజే శాంతి, నగరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కేజే కుమార్, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురానికి చెందిన లక్ష్మీపతిరాజు ఉన్నారు.
రోజా వ్యతిరేకులంతా పెద్దిరెడ్డి వర్గీయులు
ఈ నాయకులంతా మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులుగా ఉంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ తరఫున జరిగే కార్యక్రమాలను రెండు వర్గాలు విడివిడిగా చేస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరిలో కొందరు మంత్రి పెద్దిరెడ్డి అండతో నామినేటెడ్ పదవులు పొందారు. దీంతో రోజాకు, ఈ వర్గానికి మధ్య విభేదాలు పరాకాష్టకు చేరాయి. గతేడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పుత్తూరులో రోజా వర్గానికి చెంది నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొందరు దుండగులు చించేశారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మంత్రి లేకుండా జరిగిన కార్యక్రమం
తాజాగా నిండ్ర మండలం కొప్పేడులో రోజాకు సంబంధం లేకుండా వ్యతిరేక వర్గం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్బీకే, వెల్ నెస్ కేంద్రానికి భూమిపూజ నిర్వహించారు. దీనిపై మంత్రి రోజా ఆవేదన చెందారు. దీనిపై ఆమె పార్టీ నాయకులకు విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నియోజకవర్గంలో వైసీపీని బలహీనపరిచి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు నవ్వుకునేలా వ్యవహరిస్తున్నారని, మంత్రిగా ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఇతర పార్టీలకు మద్దతుగా ఉండటం ఎంతవరకు సబబు అనేది వారు ఆలోచించుకోవాలన్నారు.
ఇలాంటివారిపై పార్టీ పెద్దలు ఆలోచించాలి
తనకు నష్టం కలిగించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయడంపై పార్టీ పెద్దలంతా ఆలోచించాలని, ఇలాంటివారు పార్టీలో ఉంటే తాను రాజకీయాలు చేయడం కష్టమని, ప్రాణాలకు తెగించి తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని, ప్రతి రోజు తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివారిని నాయకులు ప్రోత్సహించడం చూస్తుంటే బాధేస్తోందని, వారిని ఎలా కొనసాగించాలో ఆలోచించాలని రోజా ఆ ఆడియోలో పేర్కొన్నారు.