సీఎం కాన్వాయ్ బిల్లులు చెల్లించాలని ఏపీ రవాణాశాఖ లేఖ; ఏపీ దుస్థితిపై మండిపడిన చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ప్రభుత్వం రవాణా శాఖకు చెల్లించవలసిన పాత బకాయిలను చెల్లించాలని లేఖ రాసింది. సీఎం, వీఐపీల కాన్వాయ్ ల బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన రవాణా శాఖ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. గత మూడు సంవత్సరాలుగా పాత బకాయిలు పేరుకుపోయాయి అని, ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని లేఖలో పేర్కొంది.

సీఎం, మంత్రుల కాన్వాయ్ ఏర్పాటుకు ప్రభుత్వం 17.5 కోట్ల పెండింగ్ బిల్లులు
ఇప్పటివరకు 17.5 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ముఖ్యనేతలతో జిల్లాల పర్యటనకు వాహనాలు సమకూర్చలేమని ఏపీ రవాణాశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతేకాదు ఇటీవల నిర్వహించిన రవాణాశాఖ సమీక్షలో కూడా అధికారులు ప్రభుత్వం పెండింగ్ బకాయిలపై రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రవాణా శాఖకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లింపు చేసేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బకాయిలు తీర్చాలని లేఖ
ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని అధికారులు లేఖ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. సీఎం జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో కాన్వాయ్ లోని వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేశారు. వీఐపీల కాన్వాయ్ ల కోసం ప్రతి సంవత్సరం కనీసం 4.5 కోట్ల రూపాయల అవసరమని రవాణాశాఖ అధికారులు లెక్క చెప్పారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో రవాణాశాఖ పేర్కొంది.

పెండింగ్ కాన్వాయ్ బిల్లులపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు
ప్రస్తుతం రవాణాశాఖ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కనీసం ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కార్లు కూడా సమకూర్చుకోలేని దుస్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం వీఐపీ కాన్వాయ్ లకు అయిన ఖర్చు 17.55 కోట్లు అని తక్షణమే చెల్లించాలని రవాణాశాఖ ప్రభుత్వానికి లేఖ రాయడం, సీఎం పర్యటనకు కార్లు ఇచ్చినవారికి అద్దె చెల్లించకపోవడం, రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతుందని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

ఇలాంటి ఘటనలతోనే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా దెబ్బ
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా వైసిపి పాలనా వైఫల్యం చంద్రబాబు వాహనాల పెండింగ్ బిల్లులు అంశాన్ని రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల విధ్వంసానికి నిదర్శనంగా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను ఘోరంగా దెబ్బ తీస్తాయని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బాధ్యత లేదని పేర్కొన్న చంద్రబాబు సిఎంకు పాలన తెలియదు అంటూ జగన్ సర్కారు పనితీరు పై నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications