విశాఖ స్మార్ట్ సిటీ: ఏపీ, అమెరికా మధ్య ఒప్పందం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంతోపాటు రాజస్థాన్లోని అజ్మీర్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లను స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ఆదివారం రెండు దేశాల ప్రతినిధులు ఎంవోయు సంతకాలు చేశారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కార్యక్రమానికి హాజరయ్యారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్యం, అభివృద్ది సంస్థ డైరెక్టర్ లియోకార్డియా ఐజాక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణారావు, ఉత్తరప్రదేశ్ ముఖ్య కార్యదర్శి అలోక్రంజన్, రాజస్తాన్ ముఖ్య కార్యదర్శి సిఎస్ రంజన్ ఎంఓయుపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం అమెరికా మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చటంతోపాటు అధ్యయనాలు, పర్యటనలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మూడు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు అధ్యయనం కోసం అమెరికా వెళ్తారు. స్మార్ట్ నగరాల అభివృద్ధికి అమెరికాలోని వాణిజ్య సంస్థలు, ప్రయివేట్ వ్యాపార సంస్థల సహకారం తీసుకుంటారు.
స్మార్ట్ నగరాల అభివృద్ధి ఒప్పందం ద్వారా అమెరికా, భారత్ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని వెంకయ్య అన్నారు. కాగా, ఏపీలో స్మార్ట్ సిటీల అభివృద్ధిపై అమెరికా ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం ఆదివారం ఢిల్లీలో కుదిరింది.
ఈ ఒప్పందాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. అమెరికా పరిశ్రమ సంస్థ విశాఖపట్నంలో విమానరంగం, ఇంధన రంగం అభివృద్ధికి సహకరిస్తాయి. దీనికి సంబంధించి త్వరలో రెండు ప్రభుత్వాలు విధి విధానాలు ఖరారు చేస్తాయి.