ఏపీలో ఆపరేషన్ స్పార్క్ పేరుతో ఇసుక రీచ్ లపై మెరుపు దాడులు
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, విపక్ష నేతల ఇసుక అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నాటికి ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగరాదని సీఎం జగన్ ఇవాళ హెచ్చరించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఆపరేషన్ స్పార్క్ పేరుతో మెరుపు దాడులు చేస్తున్నారు.
Recommended Video

ఇసుక రీచ్ లపై దాడులు- ఆపరేషన్ స్పార్క్
ఏపీలో ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం ఎంత కఠినంగా చెబుతున్నా అక్రమార్కులు మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పలుచోట్ల అధికార,విపక్ష నేతలు కుమ్మక్కై మరీ ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు.
ఇదే పరిస్ధితి కొనసాగితే స్ధానిక ఎన్నికల నాటికి ఇబ్బందికర పరిస్ధితులు తప్పవని భావించిన సీఎం జగన్ ఇవాళ అధికారులకు కఠిన హెచ్చరికలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఆపరేషన్ స్పార్క్ పేరుతో ఇసుక రీచ్ లపై మెరుపు దాడులు చేపట్టారు. ఇందులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 125 వాహనాలను , 889 యూనిట్ల ఇసుకను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

డీజీపీ ఆదేశాలు- రంగంలో దిగిన విజిలెన్స్
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్న విషయం పోలీసులు, విజిలెన్స్ అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిడితో అక్రమాలను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్న అధికారులు ఇవాళ సీఎం హెచ్చరికలతో రంగంలోకి దిగక తప్పలేదు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిపిన దాడుల్లో భారీగా అక్రమాలను గుర్తించిన అధికారులు ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం నివేదించినట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications