ఏపీలో సచివాలయ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్- రాతపరీక్షల తేదీలపై క్లారిటీ..
ఏపీలో ఖాళీగా ఉన్న సచివాలయ ఉద్యోగాల భర్తీకి త్వరలో రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రాతపరీక్షలను త్వరలోనే నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలో అధికారికంగా తేదీలు విడుదల కానున్నాయి.

సచివాలయ రాతపరీక్షలు...
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను బలోపేతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఖాళీల భర్తీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో మిగిలిపోయిన ఖాళీలకు జనవరిలోనే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం రాతపరీక్షలు నిర్వహించే లోపే కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో
19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రాతపరీక్షలకు సన్నాహాలు....
సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. జూలై చివరి వారంలో పరీక్షలు ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభమైంది.
19 రకాల పోస్టులకు సంబంధించి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఆధ్వర్వంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Recommended Video

ఇతర పరీక్షలతో ఇబ్బంది లేకుండా...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. ఈ సమాచారంతో సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇతర పరీక్షల షెడ్యూళ్లతో ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు.
14 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు కలిపి కేటగిరి -1లో నిర్వహించే పరీక్షకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్షలు ప్రారంభించే తొలిరోజునే ఈ పరీక్షను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications