తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ఉగ్రరూపం - ప్రజలు జాగ్రత్తగా ఉండాలి- రానున్న రోజుల్లో..!
వేసవి కాలం ప్రారంభమైంది. భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు కరోనావైరస్ కేసులు పెరుగుతుండగా... మరో వైపు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఓ మోస్తారు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దానికి కొనసాగింపుగా మార్చి నెలలో సూర్యుడు భగభగమంటూ నిప్పులు చిమ్ముతున్నాడు. గత రెండు వారాలుగా పరిశీలిస్తే వాతావరణం వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
కోస్తా జిల్లాల్లో ఓ వైపు సూర్యుడు తన ప్రతాపం చూపుతుంటే మరో వైపు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం నుంచి ఉత్తరాంధ్రలో 15 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో విపరీతమైన వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక సోమవారం రోజున విశాఖలో 33 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదు కాగా ఉత్తర దిక్కునుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ టెంపరేచర్స్ 40 డిగ్రీల సెల్సియస్ మార్క్ను తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక విశాఖపట్నంలో 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఎండలు ఠారెత్తిస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు పానీయాలు తీసుకోవాలని తద్వారా ఆరోగ్యంను కాపాడుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఒక్క కోస్తాంధ్ర జిల్లాల్లోనే కాకుండా...ఏపీలోని ఇతర జిల్లాల్లో కూడా ఎండలు విపరీతంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ను టచ్ చేసిందని చెప్పారు. ప్రజలు ఎండల నుంచి తమను తాము కాపాడుకోవాలని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.