AP Weather Update : ఏపీలో మరో మూడు రోజుల వర్షాలు-బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి
ఏపీని వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే వరుస తుపానులు, అల్పపీడనాలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ విభాగం మరో హెచ్చరిక చేసింది. ఏపీలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పవని హెచ్చరించింది. దీంతో రైతులు, మత్సకారులతో పాటు సాధారణ ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీర ప్రాంతం, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళా ఖాతము మీద ఉన్నది. ఇది సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముందుగా ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది.
రేపు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. అలాగే ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది.
అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్లకురిసే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. రేపు , ఎల్లుండి కూడా ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. .ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉంది. అటు రాయలసీమలో ఇవాళ, రేపు,తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్లకురిసే అవకాశముందని వెల్లడించింది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.