ఏపీలో మండుతున్న ఎండలు: రానున్న రెండ్రోజుల్లో ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు, జాగ్రత్త
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. అంతేగాక, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది.
ఏపీలోని 17 మండలాల్లో వడగాలులు
సోమవారం రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. సోమవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో విశాఖపట్నంలో 05 మండలాలు, కడపలో 04, కర్నూలులో 08 మండలాలు ఉన్నాయి. వడగాలులు వీయనున్న క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఏపీలోని 74 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో 04 జిల్లాల్లోని 74 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలోని 4 మండలాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని 2 మండలాల్లో తీవ్ర వేడి గాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో తీవ్ర వడగాలులు వీయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలోనూ మండిపోతున్న ఎండలు
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది. మరోవైపు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరి తల ద్రోణి సోమవారం విదర్భనుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిమి ఎత్తు వరకు కొనసాగుతోందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అక్కడక్కడ పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.