ఎపిని మోడల్ సిటీగా మారుద్దాం: జపాన్లో చంద్రబాబు పిలుపు
టోక్యో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ సిటీగా మార్చేందుకు తెలుగు వారంతా కలిసిరావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జపాన్లో చివరి రోజు పర్యటనలో భాగంగా అక్కడి తెలుగు వారు చంద్రబాబుకు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో చదువుకునేందుకు, వైద్యం చేయించుకునేందుకు అమెరికా, జపాన్ తదితర దేశాల నుంచి జనం వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. వికాసంలో జాపాన్ ఒరవడిని అందిపుచ్చుకుంటామని చెప్పారు. సన్మానం అనంతరం బాబు హైదరాబాద్ బయలుదేరారు. జపాన్ నుంచి హాంకాంగ్ మీదుగా చంద్రబాబు బృందం ఈరోజు అర్థరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. చంద్రబాబు జపాన్ పర్యటన విజయవంతం అయ్యిందని, ఏపీలో పెట్టుబడులకు జపాన్ పారిశ్రామికవేత్తలు సానుకూలంగా ఉన్నారని సీఎంవో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే భరోసా ఇచ్చారు. ఏపి కొత్త రాజధాని నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, సహకారం అందిస్తామన్నారు. జపాన్ రాజధాని టోక్యోలోని ప్రధాని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రతినిధి బృందంతో శుక్రవారంనాడు జపాన్ ప్రధాని భేటీ అయ్యారు.
దౌత్య సంబంధాల్లో, వర్తక వాణిజ్యాల్లో భారతదేశం తమకు ఎంతో ముఖ్యమైందని అబే అన్నారు. కేవలం కొద్ది నెలల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటించారని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జపాన్ పర్యటించారని ఇదో గొప్ప పరిణామమని అబే అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య, జపాన్తో ఆంధ్రప్రదేశ్ల మధ్య పరస్పర సహకారం వృద్ధి చెందుతుందన్నారు. ఏపి అభివృద్ధికి అన్ని రంగాల్లో తమ సహకారం ఉంటుందని, రాజధాని నిర్మాణానికి అవసరమైన మద్దతు ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications