హైదరాబాద్లోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాదులోనే నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యయం, వసతుల దృష్ట్యా హైదరాబాదులోనే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని సమాచారం. కాగా, నాగార్జునలోని డైక్మన్లో హాలును మొదట అనుకున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న తొలుత భావించింది. ఇందులో భాగంగా సభాపతి కోడెల శివప్రసాద్ సోమవారం నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విశ్వవిద్యాలయంలో డైక్మన్ హాలు సమావేశాలకు అనువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్వల్ప మార్పులతో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, సభాపతి, ఉపసభాపతి కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే వీలు ఉందన్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే డిసెంబర్ చివరి వారంలో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
అసెంబ్లీ సమావేశాలను ప్రవాసంలో కాకుండా, రాష్ట్రంలోనే జరపాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కోడెల పేర్కొన్నారు. శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించే విషయమై మూడు రోజుల్లో నివేదిక వస్తుందన్నారు. డిసెంబరులో శాసనసభ శీతాకాల సమావేశాలు ఉంటాయని తెలిపారు.
డిసెంబర్ 5వ తేదీ నుండి 8 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రక్షణ, రవాణా, విడిది, ఇతర మౌలిక సదుపాయాలకు ఇక్కడ ఇబ్బంది లేదన్నారు. ఏదేమైనా, సమావేశాలు ఇక్కడ నిర్వహించే విషయమై తుది నిర్ణయం ముఖ్యమంత్రి, ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
నాగార్జున వర్సిటీని సందర్సించిన కోడల అక్కడి డైక్మన్ హాలు, ఇంజినీరింగ్ కళాశాల భవనాలను చూశారు. డైక్మన్ హాలులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. అయితే, వ్యయం, వసతుల దృష్ట్యా హైదరాబాదులోనే నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.