ఏపీలో మహిళలపై ట్రోలింగ్ ఎఫెక్ట్ ! తెరపైకి మరో కొత్త డే..
ఏపీలో మహిళలపై సోషల్ మీడియా ట్రోలింగ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ కుటుంబంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా ట్రోలింగ్ సాగుతోంది. దీంతో ఈ ప్రభావం సహజంగానే మహిళా కమిషన్ పై సైతం పడుతోంది. మహిళా కమిషన్ పనితీరుపై ప్రభుత్వంలో పెద్దలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నష్టనివారణ చర్యలు చేపట్టారు.
ఏపీలో మహిళలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేన పోటాపోటీగానే ఉన్నాయి. ఈ ట్రోలింగ్స్ జగన్, చంద్రబాబు, పవన్ లను దాటి వారి కుటుంబ సభ్యులవరకూ పాకింది. ముఖ్యంగా ఆయా నేతల కుటుంబంలో మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్స్ పై నెటిజన్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. అయితే టీడీపీ,జనసేనతో పోలిస్తే అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఈ ట్రోలింగ్స్ ను అరికట్టే పరిస్దితి లేకపోవడంతో దీనిపై చర్చ మరింత ఎక్కువైంది.

ఏపీలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి లక్ష్యంగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై చర్యలు తీసుకోలేకపోతున్నాం అంటూ సాక్ష్యాత్తు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి కొనసాగింపుగా నిన్న మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో ఆమె నిన్న ఓ సదస్సు ఏర్పాటు చేశారు. మహిళలపై రాష్ట్రంలో జరుగుతున్న ట్రోలింగ్ కు నిరనసగా ఇకపై ప్రతీ శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియాలో రాతియుగం కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రాజకీయ కారణాలతో వారిని మరి కొందరు ప్రోత్సహించటం దారుణమన్నారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మహిళలను కించపరుస్తున్న వారి భరతం పట్టాలని, ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం ఒక కేసు తీర్పును ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోతున్నారని ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications