సంచైత తొలగింపు లింగ వివక్షే-సతీసహగమన కాలం కాదు-వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు
ఏపీలో మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ నియామకం విషయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం లింగ వివక్షను తెరపైకి తెస్తోంది. గతంలో ఛైర్ పర్సన్ గా ఉన్న సంచైత గజపతిరాజును లింగ వివక్షతోనే తొలగించారనే ఆరోపణల్ని కూడా ప్రస్తావిస్తోంది. ఇవాళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విశాఖ వెళ్లి మరీ సంచైత గజపతిరాజుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమె మాన్సాస్ లింగ వివక్షపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రతిష్ఠాత్మక మాన్సాస్ ట్రస్టుకు తొలి మహిళా ఛైర్ పర్సన్ గా వ్యవహరించిన సంచైతను దింపడానికి దుష్టప్రయత్నం జరిగిందని మహిళా కమిషన్ ఛైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఓ మహిళ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతే సంబరాలు చేసుకున్నారని విమర్శించారు. మహిళకు అధికారం లేదనే వాదన ఈ కాలంలో చెల్లదన్నారు. రక్షణ రంగంలో మహిళలకు ప్రవేశం లేదన్న కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని పద్మ గుర్తుచతేశారు. రక్షణ రంగంలో కూడా మహిళలను కోటా ప్రకారం తీసుకోవాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
లింగ వివక్షత ఎక్కడ చూపినా నేరం అవుతుందని భారత రాజ్యాంగంలోనే ఉందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళలకు అధికారం లేదని చెప్పే ఏ వాదనా చెల్లదన్నారు. రాజరికం ముసుగులో మాన్సాస్ ట్రస్టులో మహిళల హక్కులపై దాడి జరిగిందన్నారు. మహిళలకు కొన్ని ప్రదేశాల్లో ప్రవేశం లేదు, మహిళలకు కొన్ని ఛైర్స్ లో కూర్చొనే అర్హత లేదని చెప్తున్నామంటే.. కాలాన్ని మనం వెనక్కి తీసుకెళ్తున్నామా?.. సతీసహగమన కాలానికి, బ్రిటీష్ కాలానికి తీసుకెళ్తున్నట్లుందని పద్మ విమర్శించారు. జగన్ పాలనలో మహిళలకు స్వర్ణయుగం మొదలైందన్నారు. ప్రతి పథకంలో, పదవుల్లోనూ మహిళకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్టులో మహిళకు అర్హత లేదని, టీడీపీ దానిని భుజాన వేసుకుని మాట్లాడడం అంటే మహిళల పట్ల వారికున్న గౌరవం ఇదేనా? ఏం సంకేతం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
మహిళలు అన్న కారణంతో వారికి దక్కాల్సిన హక్కులను హరించవచ్చా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మా చట్టం ఒప్పుకోదు, మహిళలకు హక్కు లేదు.. అనే వాదన ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందా అని నిలదీశారు. మహిళ కాబట్టి పదవికి అనుర్హురాలు అనే లింగవివక్ష తో కూడిన వాదన చెల్లుతుందా అని అడిగారు. మహిళ అనర్హురాలు అని ఒక రాజు శిలాశాసనం చేశాడంటే అది చెల్లుబాటు అవుతుందా? సతీసహగమనం లాగే ఇది కూడా ఒక దురాచారమే అని వాసిరెడ్డి అన్నారు. మహిళలను మళ్లీ వెనుక్కి తీసుకెళ్లే ప్రయత్నమే ఇది అని ఆమె తెలిపారు. మహిళలను మళ్లీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా, భర్తతో పాటే చితిలో కాలిపోవాలనే పురాతన కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అని టీడీపీని ఆమె ప్రశ్నించారు.