ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..
ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ వైసీపీలో చేరడాన్ని వైసీసీ నియోజకవర్గ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వంశీ పార్టీలో చేరితే కార్యకర్తలు మనోనిబ్బరం కోల్పోతారని.. గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టి వేధించారని యార్లగడ్డ చెప్తున్నారు.
జగన్తో భేటీ..
ఏపీ మంత్రి కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీ. ఆయన ఇటీవల సీఎం జగన్తో సమావేశమయ్యారు. దీంతో వైసీపీలో చేరిక లాంఛనమే అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి.. వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి వంశీ సిద్ధంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావ్ అప్రమత్తమయ్యారు. తన కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
అబ్బే తెలియదే..
వంశీ పార్టీలో చేరిక గురించి తమకు సమాచారం లేదని యార్లగడ్డ అంటున్నారు. ఈ అంశంపై తన అభిప్రాయం అడిగితే చెబుతానని యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ సీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నేడు వైసీపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. గన్నవరం వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. ఇదిలాఉంటే మాజీ ఎమ్మెల్యే దాసరి పర్వత్తోమరావు కూడా యార్లగడ్డతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
4 వేల కార్యకర్తలపై కేసులు
కార్యకర్తల మనోభిష్టానికి జగన్కు తెలియజేయాలని యర్లగడ్డకు.. దాసరి సూచించారు. కార్యకర్తల అభిప్రాయాన్ని తెలియజేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టారని ఈ సందర్భంగా యార్లగడ్డ తెలిపారు. దాదాపు 4 వేల మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు వంశీ వైసీపీలో చేరితే.. కార్యకర్తలు మనోనిబ్బరం కోల్పోతారని వాపోయారు.
వంశీ కూడా..
గన్నవరంలో ప్రస్తుత పరిస్థితి గురించి యార్లగడ్డ సమావేశాలు నిర్వహిస్తుంటే.. ఇటు వల్లభనేని వంశీ కూడా అలర్టయ్యారు. కార్యకర్తలతో విడివిడిగా సమావేశం అవుతున్నారు. వైసీపీలో చేరే అంశంపై డిస్కస్ చేస్తునట్టు తెలిసింది. ఆదివారం ఉదయం అంతా కార్యకర్తలతో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా యార్లగడ్డ నుంచి వ్యతిరేకత వస్తుందని.. ఏం చేయాలనే అంశపై చర్చించినట్టు తెలుస్తోంది.