జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక నిర్ణయం : ఏకగ్రీవాలపై కొత్త టెన్షన్ : ఎమ్మెల్సీ సీట్ల భర్తీలోనూ ఉత్కంఠ..!!
ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ తరువాత బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఏప్రిల్ 1న మధ్యలో నిలిచిన ఈ ఎన్నికల నిర్వహణకు నోటీఫికేషన్ జారీ చేసారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఈ నోటిఫికేషన్ పైన కోర్టును ఆశ్రయించాయి. దీంతో..తొలుత సింగిల్ బెంచ్ ఈ నోటిఫికేషన్ నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. దీని పైన వెంటనే డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లటంతో ఏప్రిల్ 8న పోలింగ్ కు అనుమతి ఇస్తూ...ఫలితాలు వెల్లడి చేయవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక, ఈ కేసు విచారణ ముగిసిన తరువాత తుది తీర్పులో ఎన్నికలనే రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఎన్నికల రద్దుపై అప్పీల్..
ఇప్పుడు ఈ తీర్పు పైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపధ్యంలో కౌంటింగ్కు అనుమతించాలంటూ పిటిషన్లో అభ్యర్థించినట్లు అధికారులు వెల్లడించారు. నిమ్మగడ్డ రమేష ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో దట 2020 మార్చి 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్లు..ఉప సంహరణ..తుది జాబితా సిద్దం అయిన తరువాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే ఏకగ్రీవమైన ఎన్నికల పైన రాజకీయ వివాదం కొనసాగింది.
ఏకగ్రీవాల భవిష్యత్ ఏంటి..
ఆ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. హైకోర్టు తాజాగా పూర్తిగా ఎన్నికలనే రద్దు చేయటంతో ఈ ఏకగ్రీవాలు కొనసాగుతాయా..లేదా అనే సందేహం మొదలైంది. ఎన్నికల సంఘం వర్గాలు మాత్రం ఇవి యధాతధంగానే కొనసాగు తాయని చెబుతున్నాయి. కేవలం నోటిఫికేషన్ మాత్రమే కోర్టు రద్దు చేసిందని..ఆ నోటిఫికేషన్ తో జరిగిన ఎన్నికలు రద్దు అవుతాయి...ఏకగ్రీవాలకు సంబంధం లేదనేది ఎన్నికల సంఘం వాదన. అయితే, ఎన్నిక ల ప్రక్రియ మొత్తం రద్దయినట్లేనని..ఏకగ్రీవాలు మనుగడలో ఉండవనేది మరో అభిప్రాయం. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత కూడా దాదాపు ఏడాదికిపైగా వారంతా పదవీ బాధ్యతలు చేపట్టకపోవటం కూడా ఇప్పుడు న్యాయ పరమైన అంశంగా మారుతోంది.
ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి లింకు..
ఇక, ఇప్పుడు తాజాగా..శాసన మండలిలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయితేనే సాధ్యం అవుతుంది. ఈ ఎమ్మెల్సీల ఎంపికలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ తో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మున్సిపల్ ఎన్నికలు..ఫలితాలు పూర్తి కావటంతో వాటి వరకు ఇబ్బంది లేదు. అయితే, జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు సైతం పూర్తయితేనే ఈ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో..ఇలా ఒక అంశంతో మరో అంశం రాజకీయంగా ముడి పడి ఉండటంతో ఎన్నికల రద్దు తీర్పు పైన ఎన్నికల సంఘం అప్పీల్ కు వెళ్లింది. డివిజన్ బెంచ్ లో పిటీషన్ దాఖలు చేయటంతో..దీని తరువాత ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యామ్నాయల పైన ఆలోచన..
అయితే, సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టం చేసిన విధంగా నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆదేశం అమలు చేయలేదనే కారణంతో నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో...ఇప్పుడు డివిజన్ బెంచ్ లో వచ్చే ఫలితం ఆధారంగా...ఎన్నికల సంఘం భవిష్యత్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు సైతం అదుపులోకి రావటంతో ఒక వేళ అవసరమైతే కోర్టు తీర్పు ప్రకారం ప్రత్యామ్నాయం పైన అంతర్గతంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Recommended Video