కడపోళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు: సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి మెడకు సోము వీర్రాజు కామెంట్స్
కడప: కడప జిల్లావాసులపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు జిల్లావాసులు సోషల్ మీడియా వేదికగా ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. సోము వీర్రాజును అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఈ వ్యాఖ్యలు- కడప జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డిల మెడకు చుట్టుకుంటోన్నాయి.
సోము వీర్రాజుం ఏం చెప్పారంటే..?
ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తప్పు పట్టారు సోము వీర్రాజు. వైఎస్ జగన్ చేసే ప్రకటనలకు కొదవలేదని, దాన్ని కార్యరూపంలోకి పెట్టరని ధ్వజమెత్తారు. రోడ్లు వేయడానికే దిక్కు లేదని, ఇప్పుడు విమానాశ్రయాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారని మండిపడ్డారు. విమానాశ్రయాలను కేటాయించేది, వాటిని అభివృద్ధి చేసేది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమేనని అన్నారు.
బస్టాండ్లా ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ మా వల్లే అభివృద్ధి..
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ బస్టాండ్లా ఉండేదని, దాన్ని తమ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని సోము వీర్రాజు అన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలను బీజేపీ ప్రభుత్వమే మంజూరు చేసిందని చెప్పారు. బస్సు వెళ్లడానికి దారి లేని కర్నూలుకు కూడా ఎయిర్పోర్టును ఇచ్చిందని అన్నారు. అవన్నీ అంతార్జతీయ స్థాయికి తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలను మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు.
ప్రాణాలు తీసేసే కడపలో ఎయిర్పోర్ట్..
చివరికి కడపలో కూడా విమానాశ్రయాన్ని తమ బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసిందని సోము వీర్రాజు అన్నారు. ప్రాణాలను తీసేసే వారి జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ వచ్చిందని అన్నారు. కడపవాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చని, అక్కడ ఎయిర్పోర్ట్ చేశామని చెప్పారు. విమానాశ్రయాల సంగతి తాము చూసుకుంటామని, రోడ్లు వేసుకుంటే చాలని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కొత్త జిల్లాలకు మరిన్ని పేర్లు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
కడపజిల్లావారిని ప్రాణాలు తీసేవారిగా..
కడప జిల్లావారిని ప్రాణాలను తీసే వారిగా సోము వీర్రాజు వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. కడపవాసులకు ప్రాణాలను తీయడమే వచ్చని, అలాంటి జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ తెచ్చామని పేర్కొనడాన్ని జిల్లావాసులు తప్పుపడుతున్నారు. తమను హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోన్న సోము వీర్రాజు పట్ల చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. కడప జిల్లా చరిత్ర గురించి తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచే కడపలో ఎయిర్పోర్ట్ ఉందనే విషయాన్ని సోము వీర్రాజు విస్మరించారని గుర్తు చేస్తోన్నారు.
Recommended Video
సీఎం రమేష్, ఆది సమాధానం ఇవ్వాలి..?
సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు కడప జిల్లాకే చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆది నారాయణ రెడ్డి బాధ్యత వహించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తోన్నారు. తమ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఈ ఇద్దరు నేతలు తప్పు పడతారా? లేక సమర్థిస్తారా తేల్చాలని స్పష్టం చేస్తోన్నారు. జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి వైసీపీ నేతలు సమాయాత్తమౌతున్నారు.