మోడీకి షాక్: 'రూ.2000 నోటుపై ఉర్జీత్ సంతకం ఎలా, నోట్ల రద్దు వెనుక పెద్ద స్కాం'
రూ.2000 నోటు పైన కొత్త ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం ఉందని, ఆరు నెలల కింద నుంచే ముద్రిస్తున్నట్లు చెబుతున్నారని, అదే నిజమైతే నాటి రఘురాం రాజన్ సంతకం ఉండాలి కదా అని రఘువీరా ప్రశ్నించారు.
అనంతపురం: కొత్తగా వచ్చిన రూ.2000 నోటు పైన కొత్త ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం ఉందని, ఆర్థిక కార్యదర్శి మాత్రం నోట్లు ఆరు నెలల కింద నుంచే ముద్రిస్తున్నట్లు చెబుతున్నారని, అదే నిజమైతే నాటి రఘురాం రాజన్ సంతకం ఉండాలి కదా అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం ప్రశ్నించారు.
మోడీని కార్నర్ చేసేందుకు..: బంద్పై లెక్కలు, కాంగ్రెస్ సీఎం ట్విస్ట్
ఈ విషయమై దర్యాఫ్తు చేయాల్సిందేనని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందని ఆయన అన్నారు. నమో అంటే నరేంద్ర మోడీ కాదని.. 'నమ్మించి మోసం' చేయడం అని రఘువీరా కొత్త అర్థం చెప్పారు.
నోట్ల రద్దుతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. రైతులను బీజేపీ మోసగిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు పైన ప్రధాని మోడీ తీసుకుంది ఏకపక్ష నిర్ణయం అన్నారు. ఇది సామాన్యులకు, మహిళలకు, రైతులకు, పేదలకు మరణ శాసనంగా మారిందన్నారు.
పెద్ద నోట్ల రద్దు పేరిట జరిగిన కుంభకోణం పైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిబిఐ దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానికి సంబంధించిన వారి నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకునేందుకే పెద్ద నోట్లు రద్దు చేశారని తీవ్ర ఆఱోపణలు చేసారు.
'సర్వే' షాక్!: చంద్రబాబు అసహనం, పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సామాన్యులు అంటే మోడీకి లెక్క లేకుండా పోయిందన్నారు. పార్లమెంటుకు గౌరవం ఇవ్వని ప్రధాని మోడీ.. మైకు దొరికితే మాత్రం ఊదరగొడతారన్నారు. ప్రధాని మోడీని కేంద్రమంత్రి వెంకయ్య దైవదూతగా పేర్కొనడం విడ్డూరమన్నారు. రాజ్యసభ సీటు ఇచ్చినందునే ప్రశంసిస్తున్నారన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పైన కూడా రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ నిస్సిగ్గుగా ఏపీకి సాయంపై అబద్దాలు ఆడుతున్నారన్నారు. బీజేపీ విభజన చట్టానికి తూట్లు పొడిచిందన్నారు. ప్యాకేజీ పేరిట భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు.