ఫలితాల పై షర్మిల అనూహ్య స్పందన..!!
ఏపీ ఎన్నికల ఫలితాల పై పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. తన అన్న ఓటమి పైన ఒక్క వ్యాఖ్య చేయలేదు. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ఎన్నికల ప్రచార సమయం లో జగన్ లక్ష్యంగా విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
షర్మిల సూచనలు
షర్మిల కూటమిలో బీజేపీ మినహా రెండు పార్టీల నేతలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని పేర్కొన్నారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేసారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని షర్మిల పేర్కొన్నారు.

ఎండగడతాం
ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో ఆలోచించాలని షర్మిల సూచించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ..జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ.. ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందిని చెప్పిన షర్మిల.. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందని స్పష్టం చేసారు.
కడపలో మూడో స్థానం
కడప ఎంపీగా షర్మిల పోటీ చేసారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. వైసీపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డి విజయం సాధించారు. అవినాష్ రెడ్డి మొత్తంగా 5,96,207 ఓట్లు రాగా.. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్ధి భూపేష్ రెడ్డికి 5,30,305 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన షర్మిలకు 1,35,737 ఓట్లు వచ్చాయి. 014లో వైఎస్ అవినాష్ రెడ్డికి 1,90,323 ఓట్ల మెజార్టీ రాగా.. 2019లో 3,80,726 మెజార్టీ సాధించారు.
ఈ సారి షర్మిల పోటీ కారణంగా పార్లమెంట్ తో పాటుగా కడప పరిధిలో అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీకి నష్టం జరిగినట్లు పోలైన ఓట్ల లెక్కలు తేల్చి చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications