లోకేష్ గారూ.. అది తొందరపాటు నిర్ణయం.. వైఎస్ షర్మిల కామెంట్స్..!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మంత్రి నారా లోకేష్ కు ఓ విషయంలో కీలక విజ్ఞప్తి చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుండటంపై అభ్యర్ధుల నుంచి వస్తున్న అభ్యంతరాల్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ విద్యామంత్రి నారా లోకేష్ కు ఆమె ట్వీట్ చేశారు. ఇందులో విపక్షాలపై ఆయన చేస్తున్న ఆరోపణలు తొందరపాటుగా అభివర్ణించారు.
డీఎస్సీ విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వైఎస్ షర్మిల తెలిపారు. వారంతా మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారని పేర్కొన్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని వాపోతున్నారన్నారు .

కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమని షర్మిల తెలిపారు. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం.. తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుందన్నారు.

కాబట్టి డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని షర్మిల నారా లోకేష్ ను కోరారు.
90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలన్నారు. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలన్నారు. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా డీఎస్సీ పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే .. బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications