తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ-సీజేఐకి షర్మిల లేఖ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై రాజకీయ మాటల యుద్ధం సాగుతోంది. కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఈ విమర్శలు, ప్రతి విమర్శలపై కొన్ని రోజులుగా పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడుతున్నారు. ఇవాళ ఆమె లడ్డూ వ్యవహారంలో తప్పు ఎవరిదో తేల్చేందుకు సుమోటోగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరపాలని కోరుతూ ఛీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.
రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా అని వైఎస్ షర్మిల ఇవాళ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. బాబు శాంతి హోమాలు చేస్తున్నారని, పవన్ దీక్షలు చేస్తున్నారని, జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఈ ముగ్గురూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని ప్రభుత్వానికి తెలుసని, జంతువుల ఆయిల్ కలిపారు అని తెలుసని, ల్యాబ్ రిపోర్ట్ సాక్ష్యాలు కూడా ఉన్నాయని, అయినా చర్యలు మాత్రం లేవని షర్మిల ఆరోపించారు. చర్యలు లేకుండా మత రాజకీయాలు చేస్తున్నారన్నారు.

జగన్ సర్కార్ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే, కూటమి సర్కార్ లడ్డూలో మత రాజకీయాలు కలుపుతున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు. చర్చిలో,మజీద్ లో ఇలా జరిగితే ఊరుకుంటారా అని పవన్ అడుగుతున్నారని, హిందూమతం అంతానికి కుట్ర అని కేంద్ర మంత్రులు అంటున్నారని, మత ఘర్షణలు జరగాలని హిడెన్ అజెండా పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారని, మోడీ డైరెక్షన్ లో బాబు సర్కార్ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. అలాగే మోడీ కూడా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
కాబట్టి దీనిపై సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేసి విచారణ జరపాలని, లేదా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని సీజేఐ చంద్రచూడ్ కు ఆమె లేఖ రాశారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా ? లేదా ? ఆయన ఇష్టమని షర్మిల తెలిపారు. రూల్స్ అందరికీ వర్తించాలన్నారు. అంతా రూల్ ప్రకారం నడవాలన్నారు.












Click it and Unblock the Notifications