అసత్యాల అమిత్ షా, మోసకారి మోడీ, వెన్నుపోటు చంద్రబాబు: రఘువీరారెడ్డి నిప్పులు
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భావించిన టీడీపీ, బీజేపీ రెండూ కుట్ర చేశాయని, నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏపీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు.
ఆనాడు తాడేపల్లిగూడెంలో అమిత్ షా రూ.1.40 లక్షల కోట్ల లెక్కలు చెప్పినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాల్సిందని, ఈరోజు చంద్రబాబు స్పందించినప్పటికీ విశ్వసనీయత లేదని ఆయన విమర్శించారు.
వారిద్దరూ అబద్దాలకోరులే...
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ అబద్ధాల కోరులేనని, వారికీ విశ్వసనీయతే లేదని ఏపీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఏపీ విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయింది కానీ, ఆంధ్రప్రదేశ్కు అన్నివిధాలా న్యాయం చేసేందుకు ప్రయత్నించిందని రఘువీరారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ వడ్డించిన విస్తరి ఇస్తే...
ఏపీకి కాంగ్రెస్ వడ్డించిన విస్తరి ఇస్తే, దాన్ని బీజేపీ, టీడీపీలు రాజకీయ అవకాశవాదం కోసం కుక్కలు చింపిన విస్తరిలా మార్చాయంటూ రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఐదేళ్లు ప్రత్యేక హోదా, నాటి ప్రధాని మన్మోహన్ హామీలు, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ అమలైతే సుమారు 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు ఏపీకి లభిస్తాయని అన్నారు.
మోడీ, చంద్రబాబు ఇద్దరూ బాధ్యులే..
ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ దెబ్బతీస్తే, ఐదు కోట్ల ప్రజల హోదా హక్కును, ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మోడీ కాళ్ళ దగ్గర పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం జరగడానికి బాధ్యులైన మోడీ, చంద్రబాబు ఇద్దరూ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వస్తుంది.. ప్రత్యేక హోదా ఇస్తుంది...
అసత్యాల అమిత్ షా, మోసకారి మోడీ, వెన్నుపోటు చంద్రబాబు వీరంతా ఏపీని ముంచినోళ్లేనంటూ రఘువీరారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ‘హోదా' అమలు కోసం పోరాటం మొదలు పెట్టింది కూడా తమ పార్టీయేనని, 2019లో ఆ ‘హోదా'ను అమలు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.