Chandrababu : చంద్రబాబుపై మరో పిటిషన్-స్కిల్ కేసులో బయటికొస్తే అరెస్టుకు ?
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ ను క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో న్యాయస్ధానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు రేపు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబుపై సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇది హైకోర్టులో కాకుండా విజయవాడ ఏసీబీ కోర్టులోనే కావడం విశేషం.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని టీడీపీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో సీఐడీ కూడా హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేర్చి పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ చంద్రబాబును విడుదల చేస్తూ రేపు హైకోర్టు తీర్పు నిస్తే వెంటనే ఫైబర్ నెట్ స్కాంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు వీలుగా సీఐడీ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయి రేపు తీర్పు వెలువరించనునన్న నేపథ్యంలో ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్, కస్డడీతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
దీంతో సీఐడీ ముందు జాగ్రత్తగా ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రేపు తీర్పు సీఐడీకి అనుకూలంగా వస్తే సరి లేకపోతే ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసుపై ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications