వైఎస్ జగన్ దృష్టిలో పడ్డారు: ఏపీ మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చేది వీరిద్దరే!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీల భర్తీ త్వరలోనే జరగనుంది. రాష్ట్ర మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజస్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన విషయం తెలిసిందే. వీరి స్థానంలో కొత్తవారి దాదాపు ఖరారయ్యాయి.

మోపిదేవి స్థానంలో అప్పలరాజు..
రెండు మంత్రి పదవుల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డాక్టర్ అయిన అప్పలరాజు కరోనా కట్టడి కోసం స్థానికంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలోపడ్డారు. అందుకే ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
అంతేగాక, అప్పలరాజు కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారే కావడం ఇందుకు మరింత బలాన్నిస్తోంది. మోపిదేవి ఇదే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.

పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో వేణుగోపాలకృష్ణ..
శెట్టి బలిజ సామాజాకి వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి అప్పలరాజు, వేణుగోపాలకృష్ణల ప్రవేశం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recommended Video

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో వీరే..
ప్రస్తుతం శాసన మండలి మనుగడలోనే ఉండటంతో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని మర్రి రాజశేఖర్కు కేటాయించినట్లు సమాచారం. అంతేగాక, గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలను కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ భార్య జకియా సుల్తానాకు, మరో సీటును పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్పీ సామాజిక వర్గం నేత మోజెస్ రాజుకు కేటాయించనున్నట్లు సమాచారం. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం ఖాళీ అయిన స్థానానికి 9 నెలలు మాత్రమే గడువు ఉంది. అందువల్ల ఈ స్థానానికి ఎన్నిక జరగదు.












Click it and Unblock the Notifications