కేంద్రం వరమిచ్చినా జగన్ మీనమేషాలు- ఆగిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు- నిరుద్యోగులకు చుక్కలు..
ఏపీలో గతేడాది ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీల్లో రాష్ట్రంలో ఏటా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఈ ఏడాది జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా ఈ క్యాలెండర్ అమలు చేస్తామని పలుమార్లు చెప్పారు. కానీ వాస్తవంలో చూస్తే ఇప్పటికీ ఆ క్యాలెండర్ అమల్లోకి రాలేదు. నిరుద్యోగులు ఇప్పటికీ ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఏడాదిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు, తాజాగా కరోనా కారణంగా వైద్యారోగ్యశాఖలో భర్తీ చేసిన ఉద్యోగాలు మినహా మిగతా ఉద్యోగ ప్రకటనలు గగనమైపోయాయి. దీనంతటికీ ఒకటే కారణం కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో వైసీపీ సర్కారు చూపుతున్న అలసత్వమే.

ఉద్యోగాల క్యాలెండర్ ఏదీ..?
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీలను కొన్నేళ్లుగా ఆర్ధిక పరిస్ధితి పేరుతో భర్తీ చేయడం మానేశారు. వీటి వివరాలు ఏపీపీఎస్సీకి పంపాలని, వీటన్నింటినీ కలుపుకుని నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీకి గతేడాది ఆదేశాలు అందాయి. అనుకున్న ప్రకారమే ఏపీపీఎస్సీకి ప్రభుత్వ శాఖలు తమ వద్ద ఉన్న ఖాళీల జాబితాను పంపాయి. వీటితో ఏపీపీఎస్సీ 9 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల అవుతుందని నిరుద్యోగులు కూడా ఎదురుచూశారు. జనవరి 1 ఇస్తామని ముందుగా చెప్పిన ఏపీపీఎస్సీ ఆ తర్వాత కూడా ఎప్పటికీ నోరు మెదపడం లేదు. దీంతో నిరుద్యోగులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే దీని వెనుక ఉన్న అసలు కారణం బయటికొచ్చింది.

కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు...
ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటే కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం గతేడాది ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు కొత్తగా మరో 10 శాతం రిజర్వేషన్లు కలిపి వాటిని అమలు చేయాలి. అప్పుడు మొత్తం రిజర్వేషన్ల శాతం 60కి చేరుతుంది. ఇందుకోసం రిజర్వేషన్లకు అర్హులెవరో తేల్చాల్సి ఉంటుంది. ఇదో భారీ ప్రక్రియ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు రిజర్వేషన్లకు అర్హులను దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. ఆ తర్వాత వీటిని వివిధ శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాలకు వర్తింపచేయాలి. ఇవేవీ చేయకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. అలా ఇచ్చినా న్యాయస్ధానాల్లో వాటిని నిరుద్యోగులు సవాలు చేసే అకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం కూడా వీటిపై ముందుకెళ్లేందుకు సిద్ధపడటం లేదు.

నిరుద్యోగుల ఎదురుచూపులు..
కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు చేయాలనే కారణంతో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల కాకుండా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేయడంపై నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వయసు మీరిన కారణంగా పలు ఉద్యోగాలకు అర్హత కోల్పోతుంటే ఇప్పుడు రిజర్వేషన్ల అమలు పేరుతో నోటిఫికేషన్లను అడ్డుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇవేవో కుల రిజర్వేషన్లు అయితే ప్రత్యేకంగా పోరాడి తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ దీనిపై ప్రశ్నించేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో ప్రభుత్వం కూడా చూసీచూడనట్లుగా వదిలేస్తోంది. ఇదే నిరుద్యోగులకు శాపంగా మారుతోంది. అన్నింటికీ మించి ఏపీపీఎస్సీ 9 ఉద్యోగ నోటిఫికేషన్లను సిద్ధం చేసినా ప్రభుత్వ తీరుతో ఆవి ఆగిపోవడం నిరుద్యోగులకు మింగుడుపడటం లేదు.
Recommended Video

కేంద్రం వరమిచ్చినా జగన్ మాత్రం..
స్వాతంత్రం వచ్చాక దేశంలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. కేంద్రం గతేడాది ఎన్నికలకు ముందు ప్రకటించిన ఈ ప్రత్యేక రిజర్వేషన్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కానీ ఏపీ సర్కారు మాత్రం వీటి అమలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు చాల్లే అనే వైఖరి వైసీపీ సర్కారులో కనిపిస్తోంది. దీనిపై ఏపీ బీజేపీ నేతలు పలుమార్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా పరిస్ధితిలో మార్పు లేదు. రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపితే ఏ కొత్త సమస్యలు వస్తాయనే భయం కూడా వైసీపీ సర్కారులో కనిపిస్తోంది. అసలే రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్న వారినే ఓటు బ్యాంకుగా చేసుకుని రాజకీయాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు ఈ కొత్త రిజర్వేషన్లు తీసుకురావాలని భావిస్తే వారు ఎలా స్పందిస్తారన్న భయంతో కనిపిస్తోంది..












Click it and Unblock the Notifications