ఆర్టీసీ బస్సులపై ఏపీ కీలక నిర్ణయం- తెలంగాణ సరిహద్దుల వరకే సర్వీసులు
ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నెలకొన్న ప్రతిష్టంభన దసరా సందర్భంగా కూడా కొలిక్కిరాలేదు. ప్రజాప్రయోజనాలు, ఇతర అంశాల కంటే తమ పంతానికే టీఎస్ఆర్టీసీ ప్రాదాన్యం ఇవ్వడంతో తప్పని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సరిహద్దుల వరకే తమ బస్సులు నడపాలని నిర్ణయించింది. దీంతో కొంత మేర అయినా నష్టాల నుంచి బయటపడొచ్చని భావిస్తోంది. కిలోమీటర్ల కుదింపు విషయంలో తాము వెనక్కి తగ్గినా టీఎస్ఆర్టీసీ పంతం వీడకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టుల వరకే ఏపీ బస్సులు నడుస్తాయని రవాణామంత్రి పేర్నినాని తెలిపారు.
Recommended Video
దసరాకి ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యం.!ప్రజా సమస్యల పట్ల ఏపి సర్కార్ కు జనసేన సూచన.!
ఏపీ-తెలంగాణ బస్సుల పంచాయతీ..
ఏపీ-తెలంగాణ విభజన రేపిన సమస్యల్లో ఒకటైన బస్సుల పంచాయతీ ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆర్టీసీలు విభజించుకుని, సిబ్బందిని వేరు చేసుకున్న ఇరు రాష్ట్రాలు భవిష్యత్ సమస్యలపై ముందు చూపుతో వ్యవహరించలేదు. దీంతో ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల పంచాయతీ తెరపైకి వచ్చింది. గతంలో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం రాష్ట్ర విభజనకు ముందు డిపోల వారీగా తిరుగుతున్న బస్సులనే కొనసాగించాలని ఏపీ కోరుకోగా.. నష్టాల్లో ఉన్న తాము అలా తిప్పలేమని టీఎస్ఆర్టీసీ చేతులెత్తేసింది. దీంతో పలు దఫాలుగా ఏపీ-తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. వాటిలో ఫలితం తేలకపోగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వదిలేసింది. దీంతో దసరా సందర్భంగా ఏపీ నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
తమ బస్సులను తెలంగాణలో అడుగుపెట్టనీయకుండా టీఎస్ఆర్టీసీ మొండిపట్టు పట్టడంతో తుది వరకూ ప్రయత్నాలు చేసిన ఏపీఎస్ ఆర్టీసీ ఇక చేసేదేమీ లేదని చేతులెత్తేసింది. దీంతో దసరా సందర్భంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సరిహద్దుల నుంచి తమ బస్సులు రాకపోకలు సాగించే విధంగా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గరికపాడు, పంచలింగాల, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లగూడెం చెక్ పోస్టుల వద్ద తమ బస్సులను అందుబాటులోకి ఉంచాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణామంత్రి పేర్నినాని ప్రకటించారు.
సరిహద్దుల్లో అందుబాటులో బస్సులు..
ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న సరిహద్దుల వద్ద ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దసరా సందర్భంగా ఏపీకి రావాలనుకునే తెలంగాణ ప్రయాణికులు ఈ సరిహద్దుల వరకూ ఎలాగోలా చేరుకుంటే అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. వీటి షెడ్యూల్, ఇతర వివరాలను ఆర్టీసీ ప్రకటించనుంది. ఏపీలోకి వచ్చే వారికి అన్ని రకాల సర్వీసులను అందుబాటులో ఉంచుతామని రవాణా మంత్రి పేర్నినాని తెలిపారు. దసరా సందర్భంగా ఆయా బస్సులకు ప్రత్యేక ఛార్జీలు నిర్ణయించే అవకాశముంది. హైదరాబాద్ నుంచే ఎక్కువగా ఏపీకి రాకపోకలు ఉంటాయని భావిస్తున్న అధికారులు ఈ రూట్లోనే ఎక్కువ సర్వీసులను అందుబాటులో ఉంచబోతున్నారు.