మహిళలకు ఉచిత బస్సు అమలు పై కీలక ప్రకటన..!!
ఏపీలో రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ రైతులు..విద్యార్ధుల సమస్యల పైన పోరాటం చేయాలని నిర్ణయించింది. అటు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో సిలిండర్ల పంపిణీ ఇప్పటికే ప్రారంభించింది. జనవరి లో కొత్త పథకాలు అమలు పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక ప్రకటన చేసారు.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను నివేదించారు. ఈ పథకం అమలు కోసం చేస్తున్న ఖర్చు.. ప్రభుత్వం పైన భారం...వ్యతిరేకతలు వంటి వాటి పైన పూర్తి సమాచారం అందించారు. ఇక, ఏపీలోనూ ఈ పథకం అమలు గురించి కొంత కాలంగా ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ పథకం అమలు పైన ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు.

అమలు దిశగా ఇప్పటికే అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మహిళలకు శుభవార్త చెప్పనున్నట్లు తెలిపారు. కసరత్తు పూర్తి కాగానే.. సాధ్యమైనంత త్వరలోనే ఉచిత బస్సు అమలు విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. ప్రయాణికుల భద్రత తో పాటుగా సౌకర్యాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామననారు. సంస్థను లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొ న్నారు. సంస్థ కోసం 1600 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.900 కొత్త బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ప్రయివేటు ఆపరేటర్లకు ధీటుగా ఆర్టీసీ బస్సులలో సౌకర్యాలను పెంచుతున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications