ఎపి రవాణారంగంలోకి...లగ్జరీ బ్యాటరీ బస్సుల రంగప్రవేశం
విజయవాడ:అమరావతిని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఒక్కో అడుగే ముందుకు వేస్తోంది. ఆధునిక కాలంలో మోడల్ సిటీకి ఉండాల్సిన హంగులన్నీ ఒక్కొక్కటిగా సమకూరుస్తూ వస్తోంది. అలా ఎపి రవాణారంగంలో అడుగిడిన ఓ అత్యాధునిక వాహనం అందరినీ ఆకట్టుకుంటోంది.
అమరావతిని కాలుష్యరహిత నగరంగా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నెరెవేర్చేందుకు ఎపిఎస్ ఆర్టీసీ అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తాము ఏరికోరి ఆర్డరిచ్చి రప్పించిన లగ్జరీ ఎలక్ర్టిక్ బస్సును ఎప్పుడెప్పుడు రోడ్డు మీదకు తెద్దామా అని ఉవ్విళ్ళూరుతున్నారు. గోల్డ్ స్టోన్ కంపెనీకి చెందిన ఈ అత్యంత ఖరీదైన అధునాతనమైన ఎలక్ట్రిక్ బస్ పూర్తిగా బ్యాటరీతో నడుస్తుంది. ఇప్పటికే విజయవాడ డిపోకు చేరిన ఈ బస్ అటు సిబ్బందినే కాక ఇటు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

లగ్జరీ...బ్యాటరీ బస్సులు...
విజయవాడ బస్ స్టేషన్లో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. నూరుశాతం విద్యుత్ ఆధారితంగా నడిచే ఈ బస్సులను విజయవాడలో ప్రయోగాత్మకంగా నడపడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. గోల్డ్స్టోన్ కంపెనీ ఆధ్వర్యంలో తయారైన ఈ బస్సులు ఎలా నడపాలో ఇప్పటికే సంస్థ నిపుణులు ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు.

నో పెట్రోల్, డీజిల్...ఓన్లీ ఛార్జింగ్
ఈ బస్సులకు ఎలాంటి పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ అవసరం లేదు పూర్తిగా బ్యాటరీల సహాయంతో నడుస్తాయి. కేవలం 4 గంటల పాటు ఫుల్ చార్జింగ్ పెడితే..200 కిలోమీటర్ల వరకూ సులువుగా ప్రయాణించవచ్చు. ఎలాంటి కర్బన ఉద్గారాలు అనేవి లేకుండా జీరో ఎమిషన్ సామర్థ్యం కలిగిన ఈ బస్సు నుంచి ఎలాంటి కాలుష్య కారకాలైన పొగ, శబ్దం రాకపోవడం విశేషం. 47 సీట్లతో నడిచే ఈ బస్సులలో సీసీ టీవి కెమెరాలు కూడా ఉంటాయి.

ఆకట్టుకుంటోంది...ఎలక్ట్రిక్ బస్సు
ప్రస్తుతం విజయవాడ బస్ డిపో గ్యారేజీకిలో ఎలక్ట్రిక్ బస్సు సిబ్బందిని, చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే ఈ బస్సు ఖరీదు దాదాపు 3 కోట్ల రూపాయలు కాగా కాలుష్య నివారణలో ఇస్తున్న ప్రోత్సాహకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ బస్సును కొనుగోలు చేసిన వారికి 85 లక్షల రూపాయల భారీ మొత్తం సబ్సిడీగా అందిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించాల్సివుంది.

ప్రభుత్వం...ప్రోత్సహిస్తే...
కేంద్రానికి తోడు ఎపి ప్రభుత్వం కూడా సబ్సిడీ ఎక్కువగా ఇస్తే ఆర్టీసీకి ఈ బస్సుల కొనుగోలులో మరింత వెసులుబాటు లభిస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరింతమంది ప్రయాణికులకు ఈ అత్యంత ఆధునికమైన లగ్జరీ బస్సుల్లో సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన ప్రయాణం అందుబాటులోకి తేగలమంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ బస్సు కొనుగోలుకు రాష్ట్ర ఆర్టీసీకి 2 కోట్ల 15 రూపాయల ఖర్చవుతోంది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా వాటా కలిపితే.. మరింత తక్కువ ధరకే.. ఎలక్ట్రిక్ బస్సులు ఆంధ్రా ఆర్టీసీ సొంతం అవుతాయి...సో...అమరావతి సిటీ పరిథిలో అతి త్వరలో అందుబాటులోకి రానున్న ఈ వినూత్న రవాణా సాధనం మన రవాణా రంగంతో పాటు పర్యాటకరంగానికి కూడా మంచి గుర్తింపు, రాబడి తెచ్చిపెడుతుందని ఆశిద్దాం...












Click it and Unblock the Notifications