ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ కోచ్- రైళ్లను తలదన్నేలా..!!
వేసవి సెలవుల్లో ఏర్పడే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలను తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా నాన్ ఏసీ స్లీపర్ సర్వీసులైన స్టార్ లైనర్ బస్సుల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నారు.
అమరావతి: వేసవి సెలవుల ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాల స్టార్ లైనర్ 2+1 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకుని వస్తోన్నారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆయా సర్వీసుల సంఖ్యను మరింత పెంచనున్నారు. తిరుపతి, శ్రీశైలం, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాల మధ్య కూడా స్టార్ లైనర్ బస్సులను నడిపిస్తోన్నారు.

ఇప్పుడున్న సర్వీసులు ఇవే..
ప్రస్తుతం మంత్రాలయం-బెంగళూరు, కడప-విజయవాడ, కడప-హైదరాబాద్, ఒంగోలు-హైదరాబాద్, విజయవాడ-విశాఖపట్నం, నెల్లూరు-హైదరాబాద్, నెల్లూరు-బెంగళూరు మధ్య స్టార్ లైనర్ నాన్ ఏసీ స్టీపర్ బస్సులు రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సమ్మర్ సీజన్ లో మరిన్ని నగరాలు, జిల్లా కేంద్రాల మధ్య ఈ సర్వీసులను ప్రవేశపెట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. తాజాగా విజయవాడ-మియాపూర్ మధ్య కూడా ఈ బస్సు అందుబాటులోకి వచ్చింది.

రైళ్లను తలదన్నేలా..
నాన్ ఏసీ కావడం, రైలు స్లీపర్ కోచ్ లను తలదన్నేలా దీన్ని డిజైన్ చేయడం వల్ల ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. నాన్ ఏసీ కావడం వల్ల ఛార్జీ కూడా అందుబాటులోనే ఉంటోంది. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల రద్దీకి అనుగుణంగా వివిధ జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల నుంచి స్టార్ లైనర్ సర్వీసులను నడిపించనుంది ఏపీఎస్ఆర్టీసీ.

తిరుపతికి ఏసీ బస్సులు..
తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి అదనంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు నడుస్తాయి. గ్రీన్ సప్తగిరి పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపించనున్నారు ఆర్టీసీ అధికారులు. మలి విడతలో తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-మదనపల్లి మధ్య వీటిని రోడ్డెక్కించడానికి సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయి.

వేసవి సెలవుల్లో..
వేసవి సెలవుల నాటికల్లా ఆయా బస్సులను ప్రయాణికులకు తమ సేవలను అందించడానికి రెడీ కానున్నాయి. జీరో ఎమిషన్ బస్సులు అవి. డీజిల్ కు బదులుగా విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడుస్తాయి. దీనికోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. పర్యావరణ పరిరక్షణ, సప్తగిరులపై కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటోంది. ఏప్రిల్ నుంచి కొత్త బస్సులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications