ఏపీలో మహిళలతో పాటు వీరికీ ఉచిత బస్సు..! తాజా విధివిధానాలివే..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వీటిని ఇవాళ అమరావతి సచివాలయంలో ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఎవరెవరిని అనుమతిస్తారు, ఏయే బస్సుల్లో ప్రయాణానికి అనుమతి ఉంటుంది, ఇతర విధివిధానాలను ఆయన వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం "సూపర్ సిక్స్" హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల 15 న తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం అమల్లో ఎటు వంటి లోటుపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఆయన తెలిపారు.

ఇలాంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణా రాష్ట్రాలో అమలు తీరును పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 6 వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికకు ఆమోదముద్ర వేయనున్నట్లు వెల్లడించారు. ఈ పధకాన్ని రాష్ట్రంలో సమర్థ వంతంగా అమలు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ పథకం క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలు,ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐ.డి.ప్రూఫులుగా చూపించాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74 శాతం బస్సులు అంటే 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. దీంతో ఏడాదికి దాదాపు రూ.1,950 కోట్ల వ్యయం అవుతుందన్నారు. ఈ ఏడాది అదనంగా 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే రెండెళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ కు తగ్గట్టుగా డ్రైవర్లు, మెకానిక్ ల నియామకాలను కూడా చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications