పీఆర్సీ జేఏసీలో చీలిక..!! విరమణకు వ్యతిరేకం - ఆందోళన కంటిన్యూ : వారి మద్దతుతో...!!
ఏపీలో పీఆర్సీ సాధన సమితి నేతలు తమ సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చల తరువాత మంత్రులతో కలిసి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆదివారం సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. సీఎం సైతం అనేక అంశాలు ఉద్యోగ సంఘాల నేతలతో పంచుకున్నారు. అయితే, ప్రభుత్వంతో చర్చలు...సమ్మె విరమణ సమయంలోనే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఒప్పందాల పైన విభేదించారు.
వారిని సైతం కలుపుకుపోతామనే ధీమా ఉద్యోగ సంఘ నేతల్లో కనిపించింది. అయితే, దీనికి భిన్నంగా ఏపీటీఎఫ్ నేతలు ఏపీ జేఏసీకి రాజీనామా చేసారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఆందోళనకు పిలుపునిచ్చారు. కార్యాచరణ ఫిక్స్ చేసారు. వీరికి మద్దతుగా కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిలుస్తున్నారు.

జేఏసీకి ఏపీటీఎఫ్ నేతల రాజీనామా
వార్డు - గ్రామ సచివాలయాల ఉద్యోగుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చర్చల సందర్భంగానే తమ నిరసనను వ్యక్తం చేసిన ఫ్యాప్టో తాజాగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఫిట్మెంట్ పెంపుదలపై మంత్రుల కమిటీ అసలు చర్చకే అనుమతి ఇవ్వలేదని ఫ్యాప్టో తెలిపింది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున చేసిన పోరాటల వల్లే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీనిఏర్పాటుచేసి చర్చలకుపిలిచిందని ఫ్యాప్టో తెలిపింది. చర్చల్లో ఉపాధ్యాయులు, సిపిఎస్ సమస్యలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నామని ఫ్యాప్టో నాయకులు తెలిపారు.

దశల వారీ పోరాటానికి నిర్ణయం
పిఆర్సిలో 27 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ సాధనకు సిపిఎస్ రద్దుకోసం, ఇతర సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చినట్లు సంఘ నేతలుపేర్కొన్నారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేటి (7వ తేది) నుండి వారం రోజులపాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నారు. 11వ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
12వ తేదీన విజయవాడలో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసారు. ఇక, ఇదే సమయంలో ఎపి జెఎసిలోని పదవులకు ఎపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తికి ప్రభుత్వానిదే బాధ్యత అని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విమర్శించారు.

నిరసనల కొనసాగింపు
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం శనివారం కుదుర్చుకున్న ఒప్పందంతో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని, తాము దగాపడ్డామని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. ఉన్న హక్కులను కూడా పొగొట్టుకోవడం తప్ప కొత్తవి సాధించుకున్నవేమీ లేవని పేర్కొన్నారు. ఉద్యమాల ఒత్తిడితోనే ప్రభుత్వం ఒకమేరకైనా దిగొచ్చింది తప్ప ఔదార్యంతో కాదని తెలిపారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గంలోని ఈ ఆందోళన ఆగ్రహంగా మారడానికి ప్రభుత్వ వైఖరే కారణమని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పిఆర్సి సాధన కమిటీ-ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం వల్ల 3.5 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్కర్ల జెఎసి విమర్శించింది.

ప్రభుత్వం ఏం చేయబోతోంది
ప్రభుత్వం కుదుర్చుకును తప్పుడు ఒప్పందాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కనీస వేతనం రూ.20 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్టైమ్ ఉద్యోగులందరినీ ఏకం చేసి వీలైనంత త్వరలో విశాల వేదికను ఏర్పాటు చేసి, కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సిలో మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులకు చేసిన తీరని ద్రోహానికి గానూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం ఈ సంఘాలను ఏ విధంగా బుజ్జగిస్తుందీ..వీరి ఆందోళనకు ఎలాంటి ముగింపు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications