మళ్లీ పట్టాలెక్కుతోంది అరకు రైలు:.పర్యాటకుల్లో ఆనందోత్సాలు...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పర్యటకస్థలాల్లో అరకులోయకు ఉన్న క్రేజే వేరు...ప్రకృతి సహజమైన అందాలతో అలరారే ఆంధ్రా ఊటి అరకును చూసేందుకు దేశవిదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు... ఇక అరకును, బొర్రా గుహలను ఒక్కసారన్నా చూడాలని కోరుకోని ఆంధ్రుడే ఉండడు. అయితే అలా అనుకునేవాళ్లలో చాలా మంది అరకు టూర్ కు సిద్దమై కూడా కేవలం ఒకే ఒక కారణంతో వాయిదా వేసుకున్నారంటే నమ్ముతారా...కానీ ఇది నిజం....ఏమిటా రీజన్ అనే కదా మీ డౌట్....అందుకు కారణం ఒక రైలు...నమ్మశ్యంగా లేదు కదా..కానీ ఇదే వాస్తవం...అదెలాగంటారా...
అరకులోయ అందాలని...బొర్రాగుహల సౌందర్యాన్ని చూడాలంటే ఇతర రవాణా మార్గాల ద్వారా అక్కడకు చేరుకోవడానికి రైలు ప్రయాణం ద్వారా చేరుకోవడానికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రకృతి ప్రేమికులు ఢంకా భజాయించి చెబుతారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన ఈ రైలు మార్గంలో ప్రయాణిస్తూ వెళుతుంటే ప్రకృతిలో ఉండే సహజ సౌందర్యాలన్నీ బారులు తీరి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుందట...
చుట్టూ విస్తరించి ఉన్న ఆకుపచ్చని వనాల మధ్య కొండలను అధిరోహిస్తూ గుహల్లోకి దూసుకుపోతూ కేవలం ఈ దారిలోనే కనిపించే ఆ సుందర రమణీయ దృశ్యాల కలబోత...మాటల్లో చెప్పలేని అనుభూతి నిస్తుందట...ఈ మధురానుభూతులు రైలులో ప్రయాణించే పర్యాటకులకు మాత్రమే సొంతమంటున్నారు. ఇతర రవాణా సాధనాల మార్గాల్లో నేరుగా అరకులోయకు వెళ్లే పర్యటకులకు ఈ అదృష్టం ఉండనే ఉండదని నొక్కివక్కాణిస్తున్నారు. అయితే రెండు నెలలుగా ఆ రైలు తిరగడం లేదు...అది చాలదా...పర్యాటకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడానికి....అదే జరిగింది...
రైలు ప్రయాణం...
సుప్రసిద్ద పర్యాటక ప్రాంతం అరకులోయను చేరుకునేందుకు రోడ్డు మార్గం,రైలు మార్గం రెండూ ఉన్నాయి. అయితే అరకు వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువమంది రైలు మార్గం ద్వారానే అక్కడకు చేరుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కారణం అరకుకు రైలు ప్రయాణంలో లభించేంత మధురానుభూతి ఇంకెలా వెళ్లినా సొంతం చేసుకోలేమని వెళ్లొచ్చినవారు చెబుతూవుంటారు.
అరకు రైలు...
అరకు మార్గంలో ప్రయాణించే రెళ్లలో ప్రధానమైంది కొత్తవలస-కిరండోల్(కేకే) పాసింజర్ ట్రయిన్....ఆ మార్గంలో సాధారణంగా ప్రయాణించే ప్రయాణికులతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకుల్ని అరకుకు చేరుస్తూ ఉండటమే ఈ ట్రైన్ స్పెషాలిటీ. ఎత్తైన మార్గంలో భారంగా కదులుతూ అందాల విందుకే అధిక ప్రాధాన్యత అన్నట్లుగా సాగిపోయే ఈ ప్యాసింజర్ రైలు ప్రయాణం ఆగింది. అలా ఆగి రెండు నెలలు దాటింది.
బ్రేక్ కి కారణం...
కిరండల్ ప్యాసింజర్ నిలిచిపోవడానికి కారణం ఈ మార్గంలోని బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 32వ టన్నెల్ వద్ద అక్టోబరు 6న కొండరాళ్లు పడడంతో వంతెన పిల్లర్ కూలిపోయి రైలు మార్గం దెబ్బతినడం. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
శ్రమించి...నిర్మించి...
అత్యంత ఎత్తైన ఈ మార్గంలో చేరుకోవడమే కష్టమైన ప్రదేశంలో వంతెన పిల్లర్ పునర్మిర్మాణం అత్యంత క్లిష్టమైంది. అయినప్పటికి రైల్వే అధికారులు, సిబ్బంది రెండు నెలలకుపైగా శ్రమించి 100 అడుగుల ఎత్తు ఉన్న వంతెన పిల్లర్ని పునర్నిర్మించారు. దీంతో 66 రోజులపాటు నిలిచిపోయిన విశాఖ-కిరండోల్-విశాఖ పాసింజర్ రైలు(58501/58502) రెగ్యులర్ సర్వీసులు మళ్లీ సోమవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి.
అందాల అద్దాల రైలు...
అందాల అరకులో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు 8 నెలల క్రితం రైల్వే శాఖ అద్దాలరైలు ప్రయాణానికి కూడా ఈ అవాంతరంతో బ్రేక్ పడింది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ అద్దాల రైలు నిలిచిపోవడం పర్యాటకుల్ని ఎంతో నిరాశపర్చింది. విస్టోడాంగా పిలిచే ఈ స్పెషల్ ట్రైన్ కు రెండే బోగీలుంటాయి. ముందు ఇంజిన్.. ఆ తర్వాత వరసగా రెండు బోగీలు.. ప్రయాణికులు కూర్చోవడంతో పాటు.. లోయలు, అందాలు వచ్చినప్పుడు లేచి బోగీలోని ఓ పక్కగా వచ్చి నుంచుని చూసేందుకు వీలుగా అమరికలు ఏర్పాటుచేశారు. ఇందుకోసం రైలులో ఓ చివర ప్రత్యేక లాంజ్ను డిజైన్ చేశారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ అరకు అద్దాల రైలు నేటి నుంచి మళ్లీ పట్టాలెక్కనుంది
తీవ్ర నష్టం...
ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిల్చిపోవడం కారణంగా ప్రయాణికుల ద్వారా సమకూరే ఆదాయంలో నష్టం ఒక ఎత్తయితే...కె.కె.లైనులో ఇనుప ఖనిజం రవాణా నిల్చిపోవడం వల్ల వాటిల్లిన భారీ నష్టం మరో ఎత్తు. ఈ మార్గంలో ఐరన్ ఓర్ రవాణా ద్వారా రైల్వే శాఖకు రోజుకు రూ. 8 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. 66 రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడం వల్ల తూర్పు కోస్తా రైల్వే రూ.500 కోట్ల వరకు ఆదాయం కోల్పోయిందని అంచనా. అందుకే కష్టమైనా యుద్దప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టారు. వంతెన పిల్లర్ పునర్నిర్మాణం, ఇతర పనుల కోసం దాదాపు రూ.10 కోట్ల వ్యయం చేసి పనులు పూర్తి చేశారు.
పర్యాటకుల్లో ఆనందోత్సాహాలు...
ఆంధ్రా ఊటీగా వ్యవహరించే అరకుకు శీతాకాలంలో...మంచుకురిసే రోజుల్లోనే పర్యటలకు తాకిడి బాగా ఎక్కువ. అది కూడా పర్యాటకులు అరకు చేరుకోవడానికి రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. శివలింగపురం రైల్వే స్టేషన్ దాటిన దగ్గర నుంచి ఆకుపచ్చని హరితారణ్యాల మధ్య అందనంత ఎత్తులను అధిరోహిస్తూ...అంతలోనే పాతాళానికి దిగివస్తూ..గుహల్లోకి దూసుకుపోతూ...పొగమంచులను చీల్చి చెండాడుతూ సాగే రైలు ప్రయాణం..సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. అలాంటి రైలు ప్రయాణం మళ్లీ అందుబాటులోకి రావడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.