నాటి ప్రజారాజ్యం నేతలే...రేపటి జనసేన నాయకులా?...పరిస్థితి అలాగే ఉందంటున్నారు!
పశ్చిమగోదావరి:కోస్తాలో జనసేన చురుగ్గా పార్టీ కార్యకలాపాలు ఆరంభించిన తరువాత రెండు నెలల క్రితం ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ ఇటీవల భీమవరం వచ్చి వెళ్లడం ఆ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులను మళ్లీ ఒక కుదుపు కుదిపాయి. జనసేన పార్టీ ఆవిర్భావం తరువాత ఈ జిల్లాలో జనసేనకు మెజారిటీ వర్గాల నుంచి ఆశించినంత ఆదరణ లభించలేదు.
Recommended Video

అయితే పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులతో పాటు మరో కేటగిరి నేతలు జనసేనకు ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా అండదండలు అందించినట్లుగా కనిపిస్తోంది. ఆ కేటగిరి మరేదో కాదు...గతంలో ప్రజా రాజ్యం పార్టీలో చురుగ్గా వ్యవహరించిన నేతలేనని తెలిసింది. తద్వారా జనసేన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలక విషయాన్ని ఊహించడానికి ఆస్కారం ఏర్పడింది.

వాళ్లే...వీళ్లు:గమనించాలి
ఉదాహరణకు...చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేయగానే సీతారాంపురానికి చెందిన కలవకొలను తులసి ఆ పార్టీలో చేరి కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఆ పార్టీ జిల్లా కన్వీనర్గా కూడా కొనసాగారు. ప్రస్తుతం ఈయనే జనసేనలో పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యతలను మోస్తుండటం గమనార్హం. అలాగే మరో ఉదాహరణ చూస్తే మైలా వీర్రాజు అనే నాయకుడు గతంలో ప్రజారాజ్యం పార్టీలో కృష్ణా జిల్లా పెడన నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం వీర్రాజు కూడా జనసేన కండువా కప్పుకోవడం గమనించాల్సిన విషయం.

వీళ్లు కూడా...వచ్చారు.
ఈయనకూడా కొన్ని రోజుల నుంచి నియోజకవర్గంలో జనసేన తరుపున ప్రచార బాధ్యతల్ని ప్రారంభించారు. అలాగే వీళ్లిద్దరే కాదు...నాటి ప్రజారాజ్యం నేతలు డాక్టర్ ఇలపకుర్తి ప్రకాష్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ అప్పాజీలు కూడా జనసేనకు జై కొట్టారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు తెలపడంతో వీరు ముగ్గురు ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు.

లిస్ట్...ఇంకా ఉంది
ఈ లిస్ట్ ఇంతటితో అయిపోలేదు...ఇక్కడి కేబుల్ టీవీ అధినేతల్లో ఒకరైన కోటిపల్లి వెంకటేశ్వరావు, అన్నపూర్ణ థియేటర్ అధినేత అందే కవి, బాపూజీలు కూడా పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. గతంలో వీరంతా ప్రజారాజ్యం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వారే కావడం గమనార్హం. అలాగే నేతలే కాకుండా అభిమానులు, కార్యకర్తల విషయం చూసినా పవన్ అభిమానులతో పాటు మెగా అభిమానులు...జనసేన కార్యకర్తలతో పాటు నాటి ప్రజారాజ్యం కార్యకర్తలు జనసేన తరుపున మళ్లీ ఇప్పుడు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

అలా జరుగుతుందా?...
అంతేకాదు త్వరలో తాము జనసేనలో చేరనున్నట్లు, జనసేనకు తమ అండదండలు అందించనున్నట్లు మధ్యవర్తుల ద్వారా పవన్ కు తెలియజేసేవారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా ఎక్కువైందట. దీంతో ప్రస్తుతం జనసేన తరుపున చురుగ్గా పనిచేస్తున్న ఔత్సాహికుల్లో ఆందోళన మొదలైందట. కారణం తాము నూతనంగా జనసేనలోకి అడుగుపెట్టి శక్తియుక్తులన్నీ పణంగా పెట్టి పనిచేస్తుంటే...ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవంతో తమ కంటే పెద్ద, అనుభవం నేతలు చివరిక్షణంలో పార్టీలోకి వచ్చిపడితే తమ పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన వారిని పీడిస్తోందట. ఈ పరిస్థితి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాకే పరిమితం కాదని...కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోటల్లా ఇటువంటి తాకిడి గట్టిగానే ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications