తెలంగాణలో ఉన్నావా?: విలేకరిని ప్రశ్నించిన చంద్రబాబు
విజయవాడ: "నువ్వు తెలంగాణలో ఉన్నావా" అని ఓ మీడియా ప్రతినిధిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన శనివారంనాడు ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆ ఎదురు ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగులు తనతో చెప్పినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. పూర్తిస్థాయి రాజధాని నిర్మాణానికి రెండు మూడేళ్ల సమయం పడుతుందని చెప్పారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులపై సమీక్ష చేస్తానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు, తుఫానులు సమస్యగా మారాయని ఆయన చెప్పారు. మొన్న తుఫాను వచ్చినా మనలను చూసి భయయపడి పారిపోయిందని అన్నారు. తాత్కాలిక సచివాలయం తరలింపునకు అవరమైతే మరో రూ.200 - 300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఆ భవనాలు ఉపయోగంలో ఉండేలా చూస్తామని అన్నారు.
ఉద్యోగులంతా త్యాగాలు చేసి జూన్ 27వ తేదీలోగా అమరావతికి రావాలని ఆయన సూచించారు. తన భార్య రాకపోయినా తాను ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నానని ఆయన అన్నారు. నియోజకవర్గాల పెంపుపై ఎపి, తెలంగాణ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. వార్తలు కరెక్టుగా రాయాలని కూడా ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు.












Click it and Unblock the Notifications