సుప్రీం ఆగ్రహం... ఏం జరిగింది?: రోజా పిటిషన్పై హైకోర్టు సీజే ఆరా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా పిటిషన్ గురించిన వివరాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగి తెలుసుకున్నారు. హౌజ్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్లను విచారణకు స్వీకరించకపోవడంపై గురించి ఆరా తీశారు.
రోజా తరఫున సుప్రీం లాయర్ ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. అనంతరం రోజా వేసిన పిటిషన్ను మరో బెంచ్కు బదలీ చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు విచారణ వాయిదా వేశారు. కాగా, రోజా పిటిషన్ను విచారించాలని హైకోర్టు సిజేకు సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ విధించిన తన సస్పెన్షన్ను తొలగించాలని రోజా వేసిన పిటిషన్ పైన మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. సస్పెన్షన్ ప్రతులను అందజేయడంలో ఆలస్యం చేయడం ఏమిటని మండిపడింది. ఈ కేసులో ఈ రోజు విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది.
అంతకుముందు రోజా తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ... రూల్ 342/2 ప్రకారం ఆ సెషన్ వరకూ మాత్రమే సభ్యులను సస్పెండ్ చేయవచ్చని కోర్టుకు తెలిపారు. తన క్లయింటును బడ్జెట్ సమావేశాలకు హాజరుకానిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఈ కేసు హైకోర్టులోనే పరిష్కారం చేసుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. తాము హైకోర్టును ఆశ్రయిస్తే, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించారని సుప్రీం కోర్టుకు రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. ఆయనకు ఆ అధికారం ఎక్కడిదని సుప్రీం కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసును బుధవారం విచారించాలని హైకోర్టును ఆదేశించింది.