వీర జవాన్లకు పవన్ కళ్యాణ్ సెల్యూట్: గోశాలలో జనసేనాని కనుమ వేడుకలు
అమరావతి: సైనిక దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 'జనవరి 15... ఆర్మీ డే. భారతీయులందరికీ పుణ్యదినం. మన వీర జవానుల త్యాగాలను త్రికరణ శుద్ధిగా స్మరించుకునే రోజు' అని పవన్ వ్యాఖ్యానించారు.

వీర జవాన్లకు పవన్ కళ్యాణ్ సెల్యూట్..
130 కోట్లమంది భారతీయుల ప్రాణాలను అనుక్షణం రక్షించే జవానుల రుణాన్ని మనం ఏమిచ్చి తీర్చుకోగలం. నిండైన మనసుతో వారికి జేజేలు పలకడం తప్ప. ఎండనక, వాననక, కాలాలకు అతీతంగా అహర్నిశలు మన దేశపు సరిహద్దులను కాపాడే మన సైనికుల త్యాగనిరతి వెలకట్టలేనిదని పవన్ కళ్యాణ్ అన్నారు. మన ప్రాణాలను రక్షించడానికి తమ ప్రాణాలను అడ్డువేసే వారి ధీరత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాను. ఈ దేశాన్ని కాపాడే వీరపుత్రులకు నా తరపున, జనసేన శ్రేణుల తరపున జేజేలు పలుకుతున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

గోశాలలో పవన్ కళ్యాణ్ కనుమ వేడుకలు
మన జీవనయానంలో తోడుగా ఉన్న పశుపక్ష్యాదులను సైతం పూజించడం హిందూ ధర్మంలో కనిపిస్తుంది. కనుమ పండుగ రోజున మన పాడి పంటలకు దోహదపడ్డ పశు సంపదను ఆరాధిస్తాం. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కనుమ వేడుకలను గోశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోశాలలో కనుమకు సంబంధించిన పూజలను చేపట్టారు. గోవులను అలంకరించి వాటికి ఫలాలు, ఇతర ఆహారం అందించి నమస్కరించారు. గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగమని పవన్ కల్యాణ్ విశ్వసిస్తారు. ఆ క్రమంలోనే గోశాలలోని గో సంపదతోపాటు, వ్యవసాయ క్షేత్రంలోని ఇతర పశు సంపద, అక్కడకు చేరే పక్షుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

జనసేన నేత ఇంట్లో పోలీసుల సోదాలపై పవన్ చర్చ
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటిలో భోగి రోజు రాత్రి వేళ పోలీసులు తనిఖీల పేరిట భయభ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామికం. సంక్రాంతి పర్వదిన సమయంలో, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు మా పార్టీ నాయకుడి ఇంటిపైకి తనిఖీలకు వెళ్లడంపై పోలీసు శాఖ సమాధానం ఇవ్వాలి. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. తనిఖీల పేరిట హడావిడి చేయడం, అక్కడి పోలీసు చర్యలను వీడియోల ద్వారా ఉన్నతాధికారులకు చూపించడం గురించి ఆయన వివరంగా తెలియచేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసు శాఖ ఈ విధమైన చర్యలకు పాల్పడిందని అర్థం అవుతోంది. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలో నాయకుడిగా ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే- అధికార పక్షం ఈ విధమైన అప్రజాస్వామిక రీతిలో బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది ఫ్యాక్షనిస్ట్ తరహా రాజకీయమే. శ్రీనివాస్ ఇంటిపై చోటు చేసుకున్న ఈ చర్యలపై పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చర్చించారు. ఈ విషయంలో శ్రీనివాస్ కి పార్టీ ధైర్యం చెబుతుంది.. అండగా నిలుస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.












Click it and Unblock the Notifications