పట్టాభికి 14 రోజుల రిమాండ్ : నా ఇంటిపై దాడి చేసారు- న్యాయమూర్తికి వివరణ : బెయిల్ పిటీషన్ దాఖలు..!!
టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసారు. ఏపీలో డ్రగ్స్ ..గంజాయి వ్యవహారంలో అరోపణలు చేస్తూ ముఖ్యమంత్రిని అసభ్య పద జాలంతో దూషించారు. దీంతో..వైసీపీ శ్రేణులు ఆగ్రహానికి గురై పట్టాభి ఇంటి పైనా..టీడీపీ కార్యాలయాల పైనా దాడికి దిగారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని బుధవారం రాత్రి పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసారు.
ఇంటిపైన దాడి చేసారు...
ఆ సమయంలో తలుపులు బలవంతంగా తీసి పోలీసులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారని విమర్శిస్తున్నారు. తన ఇంటి పైన చాలా సార్లు దాడి చేసారంటూ పట్టాభి న్యాయమూర్తికి వివరించారు. ప్రభుత్వంలోని లోపాలనే తాను ప్రస్తావించానని..ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని చెప్పుకొచ్చారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పట్టాభి తరపు న్యాయవాదులు కోర్టులో వెంటనే బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు.
వైద్య పరీక్షలు - కోర్టులో హాజరు
ఈ రోజు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో పట్టాభికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం మూడవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు లో హాజరు పరిచారు. న్యాయస్థానం పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం వెలువరించింది. దీంతో..పట్టాభిని పోలీసులు జైలుకు తరలించారు. పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని అనుమానాలు అధికార పార్టీ నుంచి వ్యక్తం అవుతున్న సమయంలో.. పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరే అవకాశం కనిపిస్తోంది.
సీఎం పైన అనుచిత వ్యాఖ్యల కేసులో
ఇక, అరెస్ట్ చేసే సమయంలో.. పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం సీఎం జగన్పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పీఎస్ లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అరెస్ట్ చేసిన వెంటనే గవర్నరు పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టాభి అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రధాన కార్యదర్శి లోకేశ్ తో సహా పార్టీ నేతలు ఖండించారు.
పట్టాభితో చంద్రబాబు మాట్లాడించారంటూ...
పట్టాభి చేసిన వ్యాఖ్యల పైన సీఎం ఆగ్రహం - ఆవేదన వ్యక్తం చేసారు. ఇటువంటి బూతుల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సీఎం..తల్లిని సైతం దూషిస్తున్నారంటూ ఆవేదన చెందారు. ఇక, మంత్రులు..పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో పట్టాభి..చంద్రబాబు పైన రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పట్టాభి చదివారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను భరించలేకనే అభిమానం ఉన్న వారు టీడీపీ కార్యాలయం పైకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టీడీపీ కార్యాలయం పైన దాడులకు నిరసనగా ఈ ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షకు దిగారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన దీక్ష కొనసాగనుంది.