హోదాపై చివర్లో ట్విస్ట్, రాజ్యసభలో గందరగోళం: కురియన్ 'జైట్లీ' మెలిక
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు రాజ్యసభలో స్పందించారు. ఏపీకి ఏ విధంగా న్యాయం చేయాలా అని తాము ఆలోచిస్తున్నామని జైట్లీ చెప్పారు.
కేవీపీ ప్రవేశ పెట్టింది ఆర్థిక బిల్లు మాత్రమేనని, అలాంటి వాటిని కేవలం లోకసభలో మాత్రమే ప్రవేశ పెట్టాలన్నారు. అక్కడే ఓటింగ్ జరుగుతుందన్నారు. గతంలోను దీని పైన చర్చించామన్నారు. ఏపీకి న్యాయం చేయడంపై తాము ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ టిడిపి ఎంపీలతో మాట్లాడారని చెప్పారు.
చట్టంలో ఉన్న హామీలను తాము కచ్చితంగా నెరవేర్చుతామన్నారు. ప్రయివేటుగా ప్రవేశ పెట్టిన బిల్లు ఆర్థిక బిల్లా కాదా అనే అంశాన్ని కేవలం లోకసభ స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పారు. ఆర్టికల్ 100 ద్రవ్య బిల్లు గురించి స్పష్టంగా చెబుతోందన్నారు.
జైట్లీ మాట్లాడుతుండగా గందరగోళం
హోదా పైన జైట్లీ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. వారు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై జైట్లీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని చెప్పారు. జైట్లీ వాదన పూర్తిగా విన్నాక నిర్ణయం తీసుకుంటామన్నారు. కురియన్ సభ్యులకు నచ్చ చెప్పారు.
జైట్లీ ప్రసంగం కొనసాగింపు..
సభ్యులను కురియన్ సముదాయించిన అనంతరం జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాజ్యసభలో ద్రవ్య బిల్లుపై ఓటింగ్ జరగదన్నారు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లులో అన్ని ఆర్థిక అంశాలే ఉన్నాయని చెప్పారు. పన్నులు, నిధుల వ్యయం, రుణాల అంశాలు ఉంటే అది మనీ బిల్లు అవుతుందన్నారు.
నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలా అని చూస్తున్నామన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఏపీ సీం, ఎంపీలతో మాట్లాడుతోందన్నారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు, లోకసభకు వేర్వేరు హక్కులున్నాయన్నారు. కొన్ని రాజ్యసభలో నేరుగా తీసుకు రాలేమన్నారు.
ఒక ప్రభుత్వం లోకసభలో మైనార్టీగా ఉండి కొనసాగలేదని, రాజ్యసభలో మైనార్టీలో ఉన్నా కొనసాగుతుందన్నారు. తద్వారా ఏపీకి హోదా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారు. ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో లోకసభకు ప్రత్యేక హక్కులున్నాయన్నారు. ఇది ద్రవ్య బిల్లు కాదని లోకసభ సెక్రటరీ స్పష్టం చేశారన్నారు. ఏపీకి పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు.
అది టెక్నికల్ అంశం: గులాం నబీ ఆజాద్
జైట్లీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుడి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... ఇది మనీ బిల్లా లేక మరో బిల్లా అనేది టెక్నికల్ అంశమన్నారు. కానీ ఏపీకి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలన్నారు. దీనిపై గొడవ ఎందుకని ప్రశ్నించారు. జగడం అనవసరమన్నారు.
మన్మోహన్ ఇచ్చిన హామీ అమలు చేస్తామంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు. బిల్లులో ఏముందన్నారు. ఎన్నికల కారణంగా హామీలు అమలు చేయలేకపోయామన్నారు. హామీలు ఇచ్చి రెండేళ్లవుతోన్నా ఈ ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. అన్నీ చేస్తామని చెప్పీ, ఏం చేయలేదన్నారు.
సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేరుస్తారా లేదా చెప్పాలని ప్రశ్నించారు. విభజన హామీలను అన్నింటిని కచ్చితంగా అమలు చేయాలన్నారు.
హోదా ఇస్తారా లేదా : జైరాం రమేష్
జైరాం రమేష్ మాట్లాడుతూ... రాష్ట్రపతి ఆమోదంతోనే కేవీపీ ఈ బిల్లును తీసుకు వచ్చారని చెప్పారు. కేవీపీ బిల్లు ఎలాంటిదనేది అనవసరమని, అసలు హోదా ఇస్తారా లేదా చెప్పాలన్నారు. జైట్లీ అవాస్తవాలు చెబుతున్నారన్నారు.
గందరగోళం మధ్య చర్చ ముగిసిందని ప్రకటించిన కురియన్
జైట్లీ సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ సమయంలో గందరగోళం ఏర్పడింది. ఈ మధ్యనే ప్రత్యేక హోదా పైన చర్చ ముగిసినట్లు కురియన్ ప్రకటించారు. విపక్షాల పైన ఆయన సీరియస్ అయ్యారు.
కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు ఆర్థిక బిల్లు అన్న దానిపైన జైట్లీ వ్యక్తం చేసిన అభ్యంతరాల పైనే విపక్షాలు అభిప్రాయం చెప్పాలని, హోదాపై చర్చ ముగిసిందని, మరొకటి మాట్లాడవద్దని మండిపడ్డారు. కావాలంటే సభా హక్కుల తీర్మానం ప్రవేశ పెట్టాలన్నారు.
ప్రతీది ఆర్థిక బిల్లే: కపిల్ సిబాల్
జైట్లీ చెప్పిన దాని ప్రకారం ప్రతి బిల్లు కూడా ఆర్థిక బిల్లు అవుతుందని కపిల్ సిబాల్ అన్నారు. ప్తి బిల్లు కూడా సంఘటిత నిధికి సంబంధించిందే అన్నారు. జైట్లీ చెప్పిన ఆర్టికల్ 100తో నేను ఏకీభవించలేనని చెప్పారు. ఒక బిల్లుపై ఎప్పుడైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చునని చెప్పారు.
కేవీపీ పెట్టిన బిల్లు ద్రవ్య బిల్లు కాదన్నారు. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇది ద్రవ్యబిల్లా కాదా అనేది మీరు తేల్చాలన్నారు. మనీ బిల్లా కాదా అనేది రూల్స్ నిర్ణయించాలన్నారు. మీరు అనుకుంటే ఏ బిల్లునైనా మనీ బిల్లుగా చెప్పవచ్చునన్నారు.
ఆర్థిక కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం బిల్లు పెడితే అది మనీ బిల్లు అవుతుందన్నారు. బిల్లుపై ఏ దశలోనైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చునన్నారు. కేవలం ఆర్థిక అంశాలు ఉన్న దానినే మనీ బిల్లుగా చెప్పాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. కేటాయింపుల కోసం చట్టం చేయాలనడం మనీ బిల్లు కాదన్నారు.
ఏపీకి అన్ని చర్యలు చేపడతాం: జైట్లీ
ఏపీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జైట్లీ అన్నారు.
డిస్కషన్ ఓవర్: సీఎం రమేష్
కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు పైన ఓటింగ్ జరగాలని టిడిపి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. తాము కేవీపీ బిల్లుకు మద్దతిస్తున్నామని చెప్పారు.
చివరలో కురియన్ 'జైట్లీ' ట్విస్ట్
బిల్లు పైన చర్చ పూర్తయి ఓటింగుకు సిద్ధంగా ఉందన్నారు. ఇలాంటప్పుడు మళ్లీ బిల్లు పైన చర్చించలేమన్నారు. బిల్లు ఏ దశలో ఉన్న సభ్యుల అభ్యంతరాలను తాము పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఓటింగుకు తీసుకునే ముందు సభా నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు.
మనీ బిల్లా కాదా అనే దానిపై నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభాధిపతికి లేదన్నారు. కేవీపీ ప్రయివేటి బిల్లును లోకసభ స్పీకర్కు నివేదిస్తున్నామని కురియన్ పేర్కొన్నారు. ఇది మనీ బిల్లా కాదా తేల్చాల్సిందిగా లోకసభ స్పీకర్ను కోరుతున్నామన్నారు. ఈ సమయంలో ఏపీకి న్యాయం చేయాలంటూ విపక్షాలు నినాదాలు చేశాయి. వెల్లోకి చొచ్చుకెళ్లారు. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది.