పవన్ ఎఫెక్ట్: కొలిక్కొచ్చిన కేంద్రం కసరత్తు, ఏపీకిచ్చే ప్యాకేజీపై రేపే ప్రకటన?
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించే భారీ ప్యాకేజీని కేంద్రం ఇవ్వబోతుందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ప్యాకేజీపై కేంద్రం కసరత్తు కొలిక్కి
ఈ క్రమంలో ఏపీకి ప్రకటించే ప్యాకేజీపై కేంద్రం కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం భారీ ప్యాకేజీని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రులు ఇటీవలే ఏపీకి హోదా ఇవ్వలేని పక్షంలో భారీ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోడీ విదేశీ పర్యటన అనంతరం
ప్రధాని మోడీ విదేశీ పర్యటన అనంతరం ఆయనే స్వయంగా ఏపీకి ప్యాకేజీని ప్రకటిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మళ్లీ ఇప్పుడు తెరపైకి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేరు వచ్చింది. ఏపీకి హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కలిపి ప్యాకేజీ రూపంలో రూపొందించామని కేంద్రం చెబుతోంది.

రాజధానికి పెద్ద మొత్తంలో నిధులు
ఈ ప్యాకేజీలో ప్రాజెక్టులకు నిధులతో పాటు రాజధాని నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు 100శాతం నిధులపై తన బాధ్యతేనని కేంద్రం ప్రకటించబోతోంది.

నాబార్డు ద్వారా రుణం
ఇందులో భాగంగా నాబార్డు ద్వారా రుణం వచ్చేలా ఏర్పాటు చేసి, అది కూడా తన బాధ్యతగా కేంద్రం తీసుకోబోతున్నట్లు జైట్లీ ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలో పరిశ్రమలకు రాయితీలపై రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని కేంద్రం ప్రకటించబోతోంది.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్
తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ ఏపీకి హోదా ఇస్తే తద్వారా పరిశ్రమల స్థాపన జరిగి యువతకు ఉద్యోగవకాశాలు వస్తాయని పేర్కొన్న నేపథ్యంలో పారిశ్రామిక రాయితీలతో పాటు, పరిశ్రమలు పెట్టే వారికి ప్రత్యేక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తోన్నట్లు సమాచారం.

అమరావతికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ
వీటితో పాటు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీపై స్పష్టమైన భరోసాను కేంద్రం ఇవ్వనుందని తెలిసింది. ఇక ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులు, సాధారణ నిధుల మధ్య ఉన్న 30 శాతం తేడాను ఈ ప్యాకేజీలో కేంద్రం ప్రకటించనుంది.

రాజధాని నిర్మాణంపైన కేంద్రం స్పష్టమైన ప్రకటన
ఇక రాజధాని నిర్మాణంపైన కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయనుందని తెలుస్తోంది. అంతేకాదు రాజధాని నిర్మాణానికి ఎంత నిధులు ఇచ్చే విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేయనుంది. దీంతో పాటు ఏపీ రెవెన్యూ లోటుపైన కూడా కేంద్రం స్పష్టత ఇస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications