ఐదు కోట్ల మందిని నిరాశ పర్చిన జైట్లీ ప్రకటన: ఆర్ధిక సాయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్లీ నిరాశ ఎదురైంది. బుధవారం ఉదయం నుంచి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన కోసం ఎదురు చూసిన ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలింది. కొండంత రాగం తీసి కేంద్రం ఉసూరు మనిపించింది. ప్రత్యేక ప్యాకేజీతోనే కేంద్రం సరిపెట్టింది. అంతేకాదు ఆర్ధిక సాయంపై జైట్లీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ప్రత్యేక ప్యాకేజ్ పై నిర్థిష్టమైన ప్రకటన ఏమీ చేయకుండానే, విభజన చట్టంలోని హామీలన్నిటినీ నెరవేరుస్తామంటూ ఇన్నాళ్లూ పాడిన పాటే పాడారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటులో కూరుకుపోయిన మాట వాస్తవమని, ఆ విషయంలో కేంద్రం సాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సుదీర్ఘ మంతనాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను కేంద్రం తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు.
ఏపీకి అందించాల్సిన సహాయ సహకారాలపై కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. జైట్లీతో పాటు మంత్రులు వెంకయ్య నాయుడు, జైట్లీతోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి మీడియా సమావేశానికి హాజరయ్యారు. అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలోని ముఖ్యాంశాలు...
ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
ఏపీకి అందించాల్సిన సహాయ, సహకారాలపై కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నామని జైట్లీ అన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలను తప్పకుండా అమలుచేస్తామని తెలిపారు. అనేక విద్యా సంస్థలను ఇప్పటికే ప్రకటించామని అన్నారు. కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు అయ్యే మొత్తం ఖర్చు కేంద్రానిదే
పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరిస్తుందని అన్నారు. 01-04-2014 నుంచి పోలవరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు కూడా కేంద్రమే చెల్లిస్తుందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఏపీ మీద దృష్టిపెట్టామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. రెవెన్యూలోటుకు సంబంధించి 14వ ఫైనాన్స్ కమిషన్ ఆమోదించిందని చెప్పారు. మొదటి రెండేళ్ల రెవెన్యూ లోటును ఇప్పటికే చెల్లించామని చెప్పారు.
ఏపీకి హోదా గోవిందా
ప్రత్యేక హోదా ఏ ప్రాంతాలకు వర్తిస్తుందన్న విషయంపై జైట్లీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అనేది కేవలం కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలకే వర్తించాలని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని నిశితంగా చర్చించామన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిబంధనల వల్ల సాధ్యపడలేదని అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రత్యేక హోదా కాకుండా దానికి సమానమైన ప్రయోజనాలు కల్పించే విధంగా రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నామని అన్నారు.
రేపు అన్ని వివరాలు ప్రకటిస్తాం
రైల్వేజోన్, నియోజకవర్గాల పునర్విభజన సహా అనేక అంశాలు పరిశీలనలో ఉన్నాయని ఆయన చెప్పారు. పన్ను మినహాయింపులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అంశాలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ లోటు, పన్ను మినహాయింపులకు సంబంధించిన తుది వివరాలను నీతి ఆయోగ్, ఏపీ ప్రభుత్వం చర్చించి నిర్ధారించుకుంటాయన్నారు.
అమరావతి ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చాం
ఏపీ రాజధానికి అమరావతి నిర్మాణానికి రూ.2,500 ఇచ్చామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రానికి రైల్వే జోన్ అంశంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటన చేస్తారని జైట్లీ చెప్పారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం తప్పక నెరవేరుస్తుందని చెప్పి, మీడియా సమావేశాన్ని ముగించారు.
ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించింది: వెంకయ్య
ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి వీలైనంత మేర కేంద్రం సాయం అందిస్తున్నదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఏపీకి సాయం అందించడమనేది నిరంతరం సాగే ప్రక్రియ అని ఆయన అన్నారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిచెందే వరకు కేంద్రం సాయం అందిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications