ఏపీకి ఆర్ధిక ప్యాకేజీ?: జైట్లీ ప్రకటనపై క్షణం క్షణం ఉత్కంఠ
అమరావతి: ఏపీకి ఆర్ధిక ప్యాకేజీపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు మరికాసేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నార్త్ బ్లాక్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో ఏపీకి ప్యాకేజీ ఎంత ప్రకటిస్తారనే విషయాన్ని వెల్లడించనున్నారు.
ఏపీకో హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడుతున్న క్రమంలో జైట్లీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ ప్యాకేజీకి ఆర్థికశాఖ తుది మెరుగులు దిద్దుతోంది. అయితే ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొంది.
ఇదిలా ఉంటే హస్తినలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూ నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేకహోదాకు తగిన నిష్పత్తిలో ఏపీకి కేంద్రం సాయం చేస్తుందని జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు వేడిని పెంచుతున్నాయి.
బుధవారం సాయంత్రం సుజనా చౌదరి, సీఎం రమేష్లతో మరోసారి అరుణ్జైట్లీ బేటీ అయ్యారు. ప్రత్యేక ప్యాకేజీపై ఈరోజే ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మీడియాకు చెప్పడంతో కేంద్రం ఇచ్చే ఆర్ధిక ప్యాకేజీపై అందరి దృష్టి ఉంది. అయితే హోదా ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలను ఏపీకి అందిస్తామని అంటున్నారు.
హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం నిధులు, హోదా లేని రాష్ట్రాలకు 60 శాతం నిధులిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హోదాతో పాటు ఆ మిగతా 30 శాతం నిధులను ప్యాకేజీలోనే ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఏపీకి 25 విశ్వవిద్యాలయాలను ఇచ్చామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా అన్యాయం జరగబోదని జైట్లీ హామీ ఇచ్చారు.
మరోవైపు ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాలు, తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు విజయవాడలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చంద్రబాబు సలహాలు, సూచనలను కేంద్రమంత్రి సుజనా చౌదరి ఢిల్లీ పెద్దలకు తెలియజేశారు. దీంతో ఎడతెరిపి చర్చలు జరిపిన ఢిల్లీ పెద్దలు ఏపీకి సాయంపై కసరత్తు చేశారు.