ప్రత్యేక హోదాతో ఏం ఒరుగుతుంది, 90 శాతం ఇస్తున్నాం, మేం అలా చెప్పామా: జైట్లీ
Recommended Video
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాజ్యసభ, లోకసభల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఢిల్లీ వీధుల్లో, పార్లమెంటు ఆవరణలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు.
ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎందుకు ఇచ్చారనే విషయమై ఆయన స్పష్టత ఇచ్చారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే ఏం జరుగుతుంది, ఏం వస్తుందనే విషయాలపై ఆలోచించాలని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో ఏపీకి ఇచ్చిన వాటిని ప్రస్తావించారు.
ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నామంటే
తగినన్ని నిధులు లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినట్లు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం 90 శాతం నిధులు ఇస్తే, రాష్ట్రం పది శాతం నిధులు వెచ్చిస్తాయని చెప్పారు. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాలకు వాటాలు ఉంటాయని జైట్లీ చెప్పారు. జీఎస్టీని పంచుకుంటారని చెప్పారు.
ప్రత్యేక హోదా ఇస్తే ఏం ఒరుగుతుంది
ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ముఖ్యమైన అంశమని అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏం ఒరుగుతుందని ప్రశ్నించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ వనరుల కోసం ఇబ్బంది పడుతోందని, అందుకే కొన్ని ప్రత్యేక వనరులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
ప్రత్యేక హోదా అనే పదం వాడకుండా 90 శాతం నిధులు
ప్రస్తుతం ఏ రాష్ట్రానికి హోదా లేదని జైట్లీ చెప్పారు. ఏపీకి కొన్ని రోజుల పాటు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని తెలిపారు. అయిదేళ్ల పాటు 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందన్నారు. ప్రత్యేక హోదా అనే మాట వాడకుండా వాటిని అందుస్తున్నామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇచ్చినట్లే కేంద్రం 90 శాతం ఇస్తుందన్నారు.
ఇష్టం లేని విభజన, 90:10 శాతం నిధులు
ఏపీకి ఇష్టం లేని విభజన జరిగిందని జైట్లీ చెప్పారు. ఏపీ ఆదాయాన్ని కోల్పోయిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకున్నా అన్నీ ఇస్తున్నామని చెప్పారు. ఏపీకి 60:40 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, కానీ తాముప్రత్యేక పరిస్థితుల్లో 90:10 శాతం నిధులు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.
నిధులు ఎలాగైనా ఇచ్చేందుకు సిద్ధం
నాబార్డు ద్వరా నిధులు మంజూరు చేయాలని ఏపీ కోరిందని జైట్లీ చెప్పారు. నాబార్డుతో చర్చించి అందుకు అంగీకరించామని చెప్పారు. నాబార్డు, కేంద్రం ద్వారా నిధులన ఎస్పీవీకి పంపిస్తుందని, ఈ రుణాన్ని కేంద్రమే తీర్చే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. తాము ప్రత్యేక హోదా ప్రకటన చేసే సమయానికి కొన్ని రాష్ట్రాలకు హోదా ఉందని చెప్పారు. ప్రస్తుతం హోదా ఉన్న రాష్ట్రాలు లేవని తెలిపారు.
మేం నిధులు ఇవ్వం అని ఎప్పుడూ చెప్పలేదు, పెద్ద తేడా లేదు
నిధుల కేటాయింపు సెంటిమెంట్ ఆధారంగా ఉండదని జైట్లీ తేల్చి చెప్పారు. విదేశీ సంస్థలు ఇచ్చే నిధుల్లో 90 శాతం కేంద్రం భరిస్తుందని చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధులను ఇవ్వమని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. హోదాకి ప్యాకేజీకి పెద్దగా తేడా లేదన్నారు. నిధులను ఈఏపీ లేదా నాబార్డ్ ద్వారా ఎలాగైనా ఇచ్చేందుకు సిద్ధమన్నారు. రాజకీయ ఆందోళనల వల్ల నిధులు పెరగవన్నారు.