నాలుగు రోజుల్లో ఏపీకి శుభవార్త: జైట్లీ ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభావార్త ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నాలుగు రోజులు ఆగితే, ఏపీకి శుభవార్త వస్తుందని చెప్పారు. గురువారం నాడు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు.
అరుణ్ జైట్లీ ప్రసంగిస్తుండగా ఏపీ రెవెన్యూలోటు మాటేమిటని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం ప్రశ్నించారు. దీంతో అరుణ్ జైట్లీ స్పందించారు. ఏపీలో రెవెన్యూ లోటు ఉన్న విషయం తెలుసన్నారు. ఏపీకి శుభావార్త ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, శనివారం అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.
కాగా, కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన ఏపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో చేస్తున్నామని చెబుతూ వచ్చిన టీడీపీ, బీజేపీ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకేం సమాధానం చెబుతాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఏపీకి ఏ విధమైన కేటాయింపులు, కొత్త లైన్లు, పెండింగ్ పనులకు నిధుల ప్రస్తావన లేకుండా కేంద్రం ద్రోహం చేసిందని, అలాంటి వారితో సీఎం చంద్రబాబు చేతులు కలిపారని రఘువీరా అన్నారు. రైల్వే బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. రైల్వే బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఏపీ మంత్రులు కూడా చెబుతున్నారు.